|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:44 PM
ఆంధ్రప్రదేశ్లో రేపు జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా యోగా సాధనలో సరికొత్త రికార్డు సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు.యోగా మన ప్రాచీన సంస్కృతిలో భాగమని, అది మనకు లభించిన అమూల్యమైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శారీరక, మానసిక ఒత్తిళ్లను తగ్గించడంలో యోగా పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. "యోగాను నిత్యం ఆచరిద్దాం. మన జీవన విధానంలో అంతర్భాగంగా మార్చుకుందాం. విశాఖ వేదికగా జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నుంచే దీనికి నాంది పలుకుదాం" అని ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి అన్నారు. యోగా సాధన ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు."ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో విశాఖ ఆర్కే బీచ్ లో జరుగనున్న యోగా డే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. అలాగే రాష్ట్రంలో వాడవాడలా యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దాం" అని ఆయన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. వారసత్వంగా మనకు అందిన ఈ యోగా విద్యను మనమంతా ఆచరించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Latest News