|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 07:47 PM
జగన్ లేవనెత్తిన కీలక అంశాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలపై, అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తోందో వివరిస్తూ, రాష్ట్ర అప్పుల వివరాలను లెక్కలతో సహా గురువారం నాడు జగన్ దాదాపు రెండు గంటల పాటు వీడియోల రూపంలో ప్రజలకు వివరించారని ఆమె గుర్తు చేశారు.అయితే, జగన్ ప్రస్తావించిన అసలు సమస్యలకు సమాధానం చెప్పకుండా, ప్రెస్ మీట్ చివర్లో ఒక విలేకరి అడిగిన సినిమా డైలాగ్కు సంబంధించిన ప్రశ్నకు జగన్ ఇచ్చిన సమాధానాన్ని పట్టుకుని కూటమి ప్రభుత్వ నాయకులు దాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని శ్యామల విమర్శించారు. జగన్ అడిగిన ప్రధాన ప్రశ్నలకు మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆమె అన్నారు.గురువారం సాయంత్రం ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ, జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ, వాటిని ప్రస్తావించకుండా ఆయన కూడా 'రప్ప రప్ప' అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని శ్యామల వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చూస్తే, జగన్ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవనే విషయం స్పష్టమవుతోందని, రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం తీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని యాంకర్ శ్యామల తెలిపారు.
Latest News