|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:47 PM
భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి తామే చొరవ చూపాల్సి వచ్చిందని పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో భాగంగా రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్లోని తమ రెండు కీలక వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని ఆయన అంగీకరించారు. ఈ దాడుల తీవ్రతతోనే అమెరికా, సౌదీ అరేబియా జోక్యం కోరి కాల్పుల విరమణకు సిద్ధపడ్డామని ఒక టీవీ న్యూస్ షోలో దార్ బహిరంగంగా వెల్లడించారు. పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ, "దురదృష్టవశాత్తూ, తెల్లవారుజామున 2:30 గంటలకు భారత్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, పంజాబ్ ప్రావిన్స్లోని షోర్కోట్ ఎయిర్బేస్ (పీఏఎఫ్ బేస్ రఫీకిగా ప్రసిద్ధి) లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ ఘటన జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ నాకు ఫోన్ చేశారు. అప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నేను జరిపిన సంభాషణ గురించి ఆయనకు తెలిసిందని చెప్పారు. భారత్ దాడులు ఆపితే, పాక్ కూడా ఆపడానికి సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు తెలియజేయడానికి తనకు అధికారం ఉందా అని అడిగారు. నేను సరే సోదరా, మీరు మాట్లాడవచ్చు అని చెప్పాను. ఆ తర్వాత ఆయన మళ్లీ ఫోన్ చేసి, జైశంకర్కు ఈ విషయం తెలియజేశానని చెప్పారు" అని వివరించారు.
Latest News