|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 04:50 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులు ఈ నెల 20వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని తొలుత చెప్పారు. అయితే సాంకేతిక సమస్యలు, గడువు దగ్గర పడుతుండటంతో రైతులు ఆందోళన చెందారు. కానీ ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో రైతుకు ఊరట దక్కింది. ప్రభుత్వం రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే ఈ కేవైసీ చేసుకోవాలని తెలిపింది. ఈ లిస్టుల్ని రైతు సేవా కేంద్రాలకు(ఆర్ఎస్కే) పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేనివారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో అధికారులు ఈకేవైసీ జాబితాలను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హులతో అనుసంధానించారు..ఈ మేరకు 97 శాతం వరకు ఈకేవైసీ పూర్తయింది అంటున్నారు.
అన్నదాత సుఖీభ పథకానికి తాము అర్హులమో కాదోనని చాలా మంది రైతులు కంగారు పడ్డారు. అందుకే ప్రభుత్వం చెక్ స్టేటస్ అనే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసం రైతులు ప్రభుత్వ వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి.. చెక్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండా కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు ఆ రైతు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో, లేదో కూడా తెలుస్తుంది అంటున్నారు. ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రంలో సంపద్రించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పిస్తుంది అంటున్నారు. వ్యవసాయ శాఖ వెబ్ల్యాండ్ ద్వారా అర్హుల జాబితాను తయారు చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా కుటుంబం యూనిట్గా అర్హులను గుర్తించారు. ఆరు అంచెల వెరిఫికేషన్ను పూర్తి చేశారు.. ప్రజాప్రతినిధులతో పాటుగా ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర పనులకు భూమిని ఉపయోగించే వారిని అనర్హులుగా గుర్తించారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ద్వారా ఏటా రూ.20 వేల చొప్పున సాయం అందించనుంది. ఈ రూ.20వేలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేలు ఇస్తుంది. ఈ రూ.20వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Latest News