|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:01 PM
బల్గేరియాకు చెందిన వాంజెలియా పాండేవా గుష్టెరోవా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, బాబా వాంగా అంటే అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే ప్రపంచ భవిష్యవాణి గురించి ఆమె చెప్పిన అంచనాలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి. అయితే, ఇప్పుడు న్యూ బాబా వంగా జోస్యం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఆసియాలో రాబోయే మూడు వారాల్లో భారీ విపత్తు సంభవించనుందని ఆమె జోస్యం చెప్పింది. దీంతో జపాన్కు విమాన టికెట్ల బుకింగ్స్ 83 శాతం తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. జూలై 2025లో జపాన్కు భారీ సునామీ ముప్పు ఉందని, ఇది భూకంపం రూపంలో కూడా రావచ్చని న్యూ బాబా వంగా అంచనా వేసింది. దీంతో ప్రజలు జపాన్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు.
జపాన్కు చెందిన మాంగా కళాకారిణి రియో టాట్సుకి న్యూ బాబా వంగాగా గుర్తింపు పొందారు. ఆమె చెప్పిన జోస్యం ఇప్పుడు సంచలనంగా మారింది. జులైలో జపాన్కు భారీ సునామీ వచ్చే ప్రమాదం ఉందని ఆమె అంచనా వేశారు. రియో టాట్సుకి తన తాజా పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో ఈ విషయాన్ని రాసింది. 2025 జూలై 5న ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొనడం గమనార్హం. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్లు కదలడం లేదా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పారు. ఇది సునామీ లేదా భూకంపం రూపంలో ఉండవచ్చు అని వివరించింది. సముద్రంలో గాలి బుడగలు వస్తున్నట్లు తనకు కలలో కనిపించిందని ఆమె తెలిపారు. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలడానికి సూచన అని టాట్సుకి తన పుస్తకంలో రాసింది.
న్యూ బాబా వంగా జోస్యంతో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. జపాన్కు విమాన టికెట్ల బుకింగ్స్ 83 శాతం తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. జూలైలో జపాన్ వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జపాన్ టూరిజం బుకింగ్స్లో కూడా భారీగా కోత కనిపిస్తోంది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లో చేసుకున్న బుకింగ్లను 15 నుంచి 20 శాతం మంది రద్దు చేసుకుంటున్నారు. చైనాలోని హాంగ్ కాంగ్ నుంచి వచ్చే విమానాలతో పాటు హోటల్ బుకింగ్స్ 50 శాతం పడిపోయాయని బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. చైనాతో పాటు థాయిలాండ్, వియత్నాం బుకింగ్స్ కూడా 83 శాతం పడిపోయాయని చెబుతున్నారు.
తాము 80 శాతం సీట్లు నిండుతాయని అనుకున్నామని, కానీ రిజర్వేషన్లు 40 శాతం మాత్రమే వచ్చాయని ఎయిర్లైన్ జపాన్ కార్యాలయం జనరల్ మేనేజర్ హిరోకి ఇటో చెప్పారు. మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై మాట్లాడుతూ..ప్రజలు పుకార్లను నమ్మవద్దని కోరారు. ‘జపాన్ పౌరులు ఎవరూ దేశం విడిచి పారిపోవడం లేదు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని ఆయన అన్నారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకుండా తమ ప్రాంతాలను సందర్శిస్తారని ఆయన ఆశిస్తున్నారు.
కాగా, గతంలో రియో టాట్సుకి చెప్పిన జోస్యం నిజమైంది. 2011లో జపాన్లో వచ్చిన తోహోకు భూకంపం, సునామీ గురించి ఆమె ముందుగానే అంచనా వేశారు. అంతేకాకుండా ఫుకుషిమా దైచీ అణు విపత్తు, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం, COVID-19 మహమ్మారి గురించి కూడా ఆమె గతంలో కచ్చితంగా అంచనా వేసింది. ఆమె జోస్యానికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా ప్రజలు ఆమెను నమ్ముతారు. 2030లో కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుందని, ఈసారి దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పింది.
Latest News