కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ భారత్‌కు నష్టమేనన్న జెఫ్రీ బాయ్‌కాట్
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 05:38 PM

ఇంగ్లండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురైన అతిపెద్ద సమస్య రోహిత్ శర్మ రిటైర్మెంట్ కంటే విరాట్ కోహ్లీ జట్టుకు దూరం కావడమేనని ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ జట్టులో కీలక ఆటగాడని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు.గత మే నెలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనింగ్ స్థానంతో పాటు నాలుగో స్థానంలోనూ భారత్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా 36 ఏళ్ల కోహ్లీ 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేసి, టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచారు.బుధవారం 'ది డైలీ టెలిగ్రాఫ్' పత్రికలో రాసిన తన కాలమ్‌లో జెఫ్రీ బాయ్‌కాట్ ఈ విషయాలను ప్రస్తావించారు. "విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్, ఇంగ్లండ్‌ను ఓడించాలన్న భారత అవకాశాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కోహ్లీ నిష్క్రమణ చాలా పెద్ద నష్టం. మూడు ఫార్మాట్లలోనూ అతను జట్టుకు ఉత్తమ బ్యాటర్, కీలక ఆటగాడు. భారత ఆటగాళ్లు అధికంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడటం, విశ్రాంతి తక్కువగా దొరకడం వల్ల మానసికంగా అలసిపోతారు. ఎంత ప్రతిభ, అనుభవం ఉన్నా, మానసికంగా ఉత్సాహంగా లేకపోతే అది ఆటపై ప్రభావం చూపుతుంది" అని ఆయన విశ్లేషించారు.రోహిత్ శర్మ గురించి ప్రస్తావిస్తూ, "రోహిత్ అద్భుతమైన బ్యాటర్. తనదైన రోజున చూడచక్కని షాట్లు ఆడగలడు. కానీ కోహ్లీ స్థాయిలో అతను లేకపోవడం జట్టును ప్రభావితం చేయకపోవచ్చు. ఎందుకంటే అతని టెస్ట్ రికార్డు బాగుందే తప్ప, అసాధారణమైనది కాదు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఇది ఆశ్చర్యం కలిగించదు. కోహ్లీలా రోహిత్ సహజసిద్ధమైన అథ్లెట్ కాదు. ఇంగ్లండ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించడం ఎంత కష్టమో అతనికి తెలుసు, ఎందుకంటే కొత్త బంతి బాగా కదులుతుంది. అక్కడ విజయం సాధించాలంటే సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. సుదీర్ఘకాలం ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం, మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడం వల్ల అతను అలసిపోయి ఉంటాడని నేను భావిస్తున్నాను" అని జెఫ్రీ బాయ్‌కాట్ పేర్కొన్నారు.బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు తమ దూకుడుగా ఆడే శైలి ఆటకు కాస్త విరామం ఇచ్చి, ఇంగితజ్ఞానంతో ఆడితేనే భారత్‌ను ఓడించగలదని కూడా జెఫ్రీ బాయ్‌కాట్ సూచించారు. "కొన్నిసార్లు వారి క్రికెట్ ఉత్కంఠభరితంగా, ఆనందదాయకంగా ఉన్నప్పటికీ, నిర్లక్ష్యమైన బ్యాటింగ్ వల్ల టెస్ట్ మ్యాచ్‌లను కోల్పోయారు. గెలవడంపైనే వారి ఏకైక ఆలోచన ఉండాలి. ఎందుకంటే గత మూడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ మన దేశంలోనే జరిగినా, ఇంగ్లండ్ వాటిలో దేనికీ అర్హత సాధించలేకపోయింది. ఇది వారికి సిగ్గుచేటు. తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడమే వారి లక్ష్యం కావాలి" అని ఆయన హితవు పలికారు."కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ఇప్పుడు మొదలవుతుంది. వినోదాన్ని అందించేవాడిగా పేరు తెచ్చుకోవడం కంటే విజేతగా నిలవడం గొప్పదని ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఎవరో ఒకరు చెప్పాలి. గెలుస్తూ వినోదాన్ని అందించగలిగితే అది బోనస్. ప్రస్తుతానికి ఇంగ్లండ్ ఒకే తరహా వ్యూహంతో ఆడుతోంది. ఓటముల నుంచి వారు మారడానికి లేదా నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎంతో మంది ఇంగ్లండ్ మాజీ టెస్ట్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌ను నియంత్రించుకోమని చెబుతున్నా ఫలితం కనిపించడం లేదు. కాబట్టి దయచేసి, మీ ఆటతీరును చక్కదిద్దుకోండి, అత్యుత్తమ ప్రదర్శన కనబరచండి, కొంత క్రికెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించండి" అని జెఫ్రీ బాయ్‌కాట్ ముగించారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM