|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:35 AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దాదాపు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రెంటపాళ్ళ, నందిగామ అడ్డరోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.రెంటపాళ్ళలో వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. మరోపక్క జగన్ పర్యటనకు ఆయన కాన్వాయ్ తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటన విజయవంతానికి వైసీపీ పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తుండటంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అనుమతికి మించి వైసీపీ శ్రేణులు పాల్గొంటే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.కాగా, మరోవైపు నందిగామ అడ్డరోడ్డు వద్ద గోబ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ మంగళవారం రాత్రి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం తెల్లవారేసరికి పోలీసులు తొలగించారు. జగన్ ఈ పర్యటన నేపథ్యంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో పల్నాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Latest News