|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:43 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. జనాన్ని పంపి హింస ప్రేరేపించాలని కుట్ర పన్నుతున్నారు. ఈనెల 18న రెంటపాళ్ల వెళ్తున్న వైయస్ జగన్ ను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. పర్మిషన్ పేరుతో విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులని పరామర్శింటానికే వైయస్ జగన్ వెళ్తున్నారు. కానీ పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే అసలు వైయస్ జగన్ బయటకు రావటానికి వీల్లేదన్నట్టుగా ఉంది. పొదిలిలో కూడా రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. రెంటపాళ్లలో వైయస్ఆర్సీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యుల పరామర్శకు వైయస్ జగన్ వెళ్తుంటే ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది. తమ కార్యకర్త చనిపోతే అధినాయకుడు పరామర్శించటం తప్పా?. బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. అంతేకానీ వైయస్ జగన్ ని పర్యటించ వద్దనటం కరెక్టు కాదు. వైయస్ జగన్ పర్యటనలో హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అధికారం ఉందని అతిగా ప్రవర్తించద్దని చంద్రబాబు, లోకేష్ కి చెప్తున్నాం. జనాన్ని పెట్టి కోడిగుడ్లు, టమోటాలు వేయించాలనుకోవటం దారుణం. జనాన్ని అణచి వేయాలనుకుంటే కుదరదు . చంద్రబాబు హెచ్చరికలు ఏపాటివో మా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం . చంద్రబాబు రాజకీయాలను చూసి మేము భయపడేది లేదు` అని అంబటి రాంబాబు హెచ్చరించారు.
Latest News