|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 05:24 PM
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘానీ నగర్ సమీపంలో కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేసింది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ విమాన దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర విచారానికి గురిచేసిందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు."అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయిందన్న వార్త విని షాక్ కు గురయ్యాను. 242 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం మేఘానీ నగర్ సమీపంలో కూలిపోవడం అత్యంత విషాదకరం" అని తెలిపారు."బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విపత్తులో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని లోకేశ్ పేర్కొన్నారు.అధికారులు తక్షణమే స్పందించి, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఈ దుర్ఘటనకు గల కారణాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరుతున్నట్లు నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Latest News