|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 09:31 AM
బంగ్లాదేశ్లో నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై కొందరు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి సిరాజ్ గంజ్ జిల్లాలోని ఠాగూర్ పూర్వీకుల నివాసం రవీంద్ర మెమోరియల్ మ్యూజియం సందర్శనకు వచ్చారు. అయితే ఆ సమయంలో వాహనం పార్కింగ్ ఫీజు విషయంలో మ్యూజియం సిబ్బందితో వారికి గొడవ జరిగింది.దీంతో వారు ఆ వ్యక్తిని నిర్బంధించి దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక గుంపు మ్యూజియం ఆడిటోరియంపై దాడి చేసి ధ్వంసం చేసింది. సంస్థ డైరెక్టర్పై కూడా దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనపై దర్యాప్తుకు పురావస్తు శాఖ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అనివార్య కారణాల వల్ల మ్యూజియంకు సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కచహరిబాడీగా కూడా పిలువబడే ఠాగూర్ పూర్వీకుల ఇంటిని రెవెన్యూ కార్యాలయంగా ఉపయోగించారు.
Latest News