భారత్-మాల్దీవులు వివాదం ముగిసినట్లేనా
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:20 PM

ఎన్నో ఏళ్లుగా భారత్, మాల్దీవులు మధ్య స్నేహపూర్వక, వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే మాల్దీవులు అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. మాల్దీవుల్లో ఉన్న భారత దళాలను కూడా మహమ్మద్ ముయిజ్జు వెనక్కి పంపించారు. భారత పర్యాటకం, ప్రధాని మోదీపై మాల్దీవులు నేతలు చేసిన వ్యాఖ్యలు, అధ్యక్షుడు వ్యవహరించిన తీరు.. తీవ్ర దుమారం రేపింది. అయితే అందుకు మాల్దీవులు భారీగా మూల్యం చెల్లించుకుంది. భారత పర్యాటకులు ఇచ్చిన షాక్‌కు మాల్దీవులు టూరిజం భారీగా పతనం అయింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవులు.. భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ తర్వాత "ప్లీజ్ మా దేశానికి రండి" అంటూ భారతీయులను వేడుకుంది. ఆ తర్వాత మాల్దీవులు రోజురోజుకూ అప్పుల్లో కూరుకుపోతున్న సమయంలో భారత్‌ను సహాయం కోసం అర్థించింది. ఇక ప్రధాని మోదీని మాల్దీవుల్లో పర్యటించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు వచ్చే నెలలో ఆ దేశానికి వెళ్లనున్నారు. మోదీ టూర్‌కు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను మాల్దీవులకు గ్లోబల్ టూరిజం అంబాసిడర్‌గా నియమించడం గమనార్హం.


చాలా కాలంగా మిత్ర దేశాలుగా ఉన్న భారత్, మాల్దీవులు.. 2023 మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయాయి. ఆ ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి రాగా.. భారత్‌ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ.. అదే సమయంలో చైనాకు అనుకూల వ్యక్తిగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో భారత్, మాల్దీవులు మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది. అయితే 2024 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లక్ష్యద్వీప్‌లో పర్యటించి.. అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడే వివాదం మొదలైంది. ఆ సమయంలో మాల్దీవులు మంత్రులుగా ఉన్న మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మాజిద్‌లు.. సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా, ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి.


మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ రెండు దేశాల మధ్య రక్షణ సహకారంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మాల్దీవుల్లో భారత సైనికులు ప్రధానంగా మానవతా సహాయం, రక్షణ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే 2025 మే నెల నాటికి భారత సైనిక సిబ్బంది స్థానంలో సామర్థ్యం కలిగిన భారతీయ సాంకేతిక సిబ్బందిని నియమిస్తామని మోదీ సర్కార్ ప్రకటించింది.


అంతేకాకుండా మాల్దీవులపై చైనా పెరుగుతున్న చైనా ప్రభావం కూడా రెండు దేశాల మధ్య దూరానికి ఒక ప్రధాన కారణం. మాల్దీవుల్లో గత ప్రభుత్వాలు ముఖ్యంగా అబ్దుల్లా యామీన్ హయాంలో.. చైనాకు బాగా దగ్గరయ్యాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరి.. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు చైనా కంపెనీలకు అప్పగించింది. దీంతో మాల్దీవులను చైనా అప్పుల ఊబిలోకి నెట్టింది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న మాల్దీవులపై చైనా ప్రభావం పెరుగుతుండటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది.


అయితే చేసిన తప్పు తెలుసుకున్న మాల్దీవులు భారత్‌తో వివాదాన్ని ముగించి.. మళ్లీ మిత్ర దేశంగా మారాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని కీలక అడుగులు వేస్తోంది. గత నెలలోనే మాల్దీవుల విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నాయని ఈ సందర్భంగా మాల్దీవులు స్పష్టం చేసింది. ఇక అదే సమయంలో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు భారత్ ఇప్పటికీ ముఖ్యమైన సాయాన్ని అందిస్తోంది. 2024లో మాల్దీవులకు 400 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3500 కోట్ల సహాయంతోపాటు రూ.3 వేల కోట్ల ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్‌ను అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్దీవుల కోసం 100 మిలియన్ డాలర్లు అంటే రూ.856 కోట్ల ట్రెజరీ బిల్లులను కూడా రోల్‌ఓవర్ చేసింది.


కత్రినా కైఫ్ ‌ మాల్దీవులకు గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు.. మాల్దీవ్స్ మార్కెటింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ కార్పొరేషన్‌ మంగళవారం ఒక ప్రకటన వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్ట్‌లను తమ దేశానికి రప్పించేందుకు విజిట్‌ మాల్దీవ్స్ పేరుతో ప్రత్యేక సమ్మర్‌ సేల్‌ ప్రచారాన్ని తాజాగా ఆ దేశం మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే కత్రినా కైఫ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇక తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కత్రినా కైఫ్ సంతోషం వ్యక్తం చేశారు. మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్ కావడం చాలా ఆనందంగా ఉందని.. ‘మాల్దీవులు సహజ సౌందర్యానికి, ప్రశాంతతకు నిలయమని పేర్కొన్నారు. మాల్దీవులకు టూరిస్ట్‌లను పెంచేందుకు తన ప్రయత్నం చేస్తానని కత్రినా కైఫ్ తెలిపారు.


అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మాల్దీవులు పర్యటనకు ముందు ఆ దేశం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ.. జులై నెలలో మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఇటీవల భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం అవుతున్న వేళ.. 2024లో మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు.. జులైలో మాల్దీవులకు ప్రధాని మోదీ వెళ్లనున్నట్లు ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది.

Latest News
US forces seize 2nd oil tanker off coast of Venezuela Sun, Dec 21, 2025, 02:52 PM
Pakistan: Police vehicle targeted near Afghan refugee camp targeted in Khyber Pakhtunkhwa Sun, Dec 21, 2025, 02:44 PM
Would have got Jaiswal and Jitesh in place of Ishan and Washington, says Jaffer Sun, Dec 21, 2025, 02:36 PM
Sydney terror attack: Australia marks Day of Reflection for victims, orders intelligence review Sun, Dec 21, 2025, 01:43 PM
PM Modi interacts with Assam students aboard Brahmaputra cruise Sun, Dec 21, 2025, 01:37 PM