![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 06:01 PM
ప్రముఖ సంస్థ రిలయన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల మధ్య గతంలో ఎంవోయూ కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకార రాష్ట్రంలో 65 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఒక్కో ప్లాంట్ 130 కోట్ల రూపాయల ఖర్చుతో 500 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం తర్వాత.. ఏపీలో మరోచోట పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ఆసక్తి చూపుతోంది. రూ.1,622 కోట్లతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ఆసక్తి ప్రదర్శిస్తోంది.
రూ.1622 కోట్లతో కర్నూలు జిల్లాలో రిలయన్స్ బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ సమర్పించింది. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసే బెవరేజేస్ యూనిట్లో ప్యాకేజ్డ్ సాఫ్ట్డ్రింక్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేయనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం మొదటిదశలో రూ.1,006 కోట్లు రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుంది. అలాగే రెండో దశలో రూ.616 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్.. ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్లో ప్రతిపాదించింది. ఆరేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని డీపీఅర్లో పేర్కొంది.
మొత్తంగా రెండు దశల్లో కలిపి రూ.1622 కోట్లు రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్ బెవరేజెస్ యూనిట్ కారణంగా ఈ ప్రాంతంలోని 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మరోవైపు ఆఫీసు భవనాలు, వేర్ హౌసింగ్, బాట్లింగ్ లైన్ ఏరియా, ట్రీట్మెంట్ ప్లాంటు కోసం సుమారు 100 ఎకరాల భూములు అవసరమని.. ఆ మేరకు భూములు కేటాయించాలంటూ రిలయన్స్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.
కర్నూలు జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంలో భూములు కేటాయించాలని రిలయన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్ పేరుతో ఈ బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.
Latest News