ఓఎంసీ కేసులో శిక్ష పడటంతో గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 09:42 AM

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ  కేసులో సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్‌ చేయాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన శాసనసభ్యత్వం కోల్పోకుండా ఉండేందుకు, రాబోయే ఎన్నికల నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. గాలి జనార్దన్‌రెడ్డితో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్‌, అలీఖాన్‌లు కూడా బెయిల్‌ కోసం మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.సోమవారం ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు నాగముత్తు, నళిన్‌కుమార్‌, జె.రామచంద్రారావు, పి.నాగేశ్వర్‌రావు తమ వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టు విధించిన శిక్ష కేవలం ఏడేళ్లేనని, ఇలాంటి కేసుల్లో సాధారణంగా మెరిట్స్‌లోకి వెళ్లకుండానే బెయిల్‌ మంజూరు చేయవచ్చని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. అఫ్జల్‌ అన్సారీ, రాహుల్‌ గాంధీ కేసులతో సహా పలు సుప్రీంకోర్టు తీర్పులను వారు ఉదహరించారు. నిందితులు ఇప్పటికే గరిష్ఠంగా మూడున్నరేళ్ల శిక్ష అనుభవించారని, క్రిమినల్‌ అప్పీళ్లపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే వరకు బెయిల్‌ ఇవ్వాలని వారు కోరారు.సీబీఐ తరఫు న్యాయవాది కాపాటి శ్రీనివాస్‌ వాదిస్తూ, బెయిల్‌ పిటిషన్ల విషయంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా సీబీఐ కట్టుబడి ఉంటుందని తెలిపారు. అయితే, గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన జైలు శిక్ష సస్పెన్షన్‌ వ్యాజ్యాలను మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. శిక్ష సస్పెన్షన్‌ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.గాలి జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాది నాగముత్తు తన వాదనలు వినిపిస్తూ, తన క్లయింట్‌ మినహా మిగిలిన నిందితులు ఎవరూ చట్టసభ సభ్యులు కాదని పేర్కొన్నారు. సీబీఐ కోర్టు తీర్పు కారణంగా కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి సభ్యత్వం ఈ ఏడాది మే 8న రద్దయిందని తెలిపారు. ప్రస్తుతం తమ పిటిషన్‌పై కోర్టు ఏదో ఒక నిర్ణయం వెల్లడించకపోతే కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వారం గాలి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని, ఆ లోపే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌లో తమకు అనుకూలంగా తీర్పు వస్తే, ఎమ్మెల్యే సభ్యత్వం దానంతట అదే పునరుద్ధరణ అవుతుందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన జైలుశిక్ష సస్పెన్షన్‌ అప్లికేషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్‌ అప్లికేషన్లపై తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన జైలుశిక్ష సస్పెన్షన్‌ అప్లికేషన్‌పై మంగళవారం  విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.ఇదే సమయంలో, శ్రీలక్ష్మిని డిశ్చార్జి చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టేసి, కేసును మళ్లీ విచారించాలని హైకోర్టుకు తిప్పి పంపిన విషయాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ లక్ష్మణ్‌, తొలుత శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ తన వద్దకే వచ్చిందని, దానిని తాను కొట్టేశానని తెలిపారు. డిశ్చార్జి పిటిషన్‌పై అప్పీల్‌ మరో ధర్మాసనం వద్దకు వెళ్లగా, ఆ బెంచ్‌ అప్పీల్‌ను అనుమతించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి కేసును తిరిగి హైకోర్టుకే పంపినందున, ఆ పిటిషన్‌ నంబర్‌ను సమర్పిస్తే దానిపైనా విచారణ చేపడతామని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM