అరకు, గండికోట, సూర్యలంకలో ప్రయోగాత్మకంగా నిర్మాణం
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 09:39 AM

రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించి, పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అరకు, గండికోట, సూర్యలంక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా మూడు టెంట్ సిటీలను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.50 కోట్లకు పైగా వ్యయంతో మొత్తం 150 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఈ గదుల్లో స్టార్ హోటళ్లకు దీటుగా సౌకర్యాలు కల్పించనున్నారు.వివిధ నమూనాల్లో టెంట్ సిటీలు ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన పర్యాటక విధానాలను ఏపీలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గుజరాత్‌లోని కెవాడియా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య తరహాలో ఈ టెంట్ సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది. అరకులో ఏపీటీడీసీ సొంతంగా టెంట్ సిటీని నిర్మించనుండగా, గండికోట, సూర్యలంకలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వీటిని ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలవనున్నారు.ప్రస్తుతం అరకులోని ఏపీటీడీసీ రిసార్ట్‌లలో వసతులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పది ఎకరాల విస్తీర్ణంలో టెంట్ సిటీని ఏర్పాటు చేసి 50 గదులను నిర్మిస్తారు. దీనికి రూ.18 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. గండికోటలో కూడా పది ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో టెంట్ సిటీ రూపుదిద్దుకోనుంది. ఇక్కడ 60 గదులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ‘సాస్కీ’ పథకం కింద రూ.78 కోట్లతో గండికోట అభివృద్ధి పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఈ పనులు పూర్తయితే సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో విశాఖ ఆర్కే బీచ్ తర్వాత పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో కూడా వసతుల కొరత ఉంది. ఇక్కడ పది ఎకరాల్లో పీపీపీ విధానంలో 50 గదులతో టెంట్ సిటీని అభివృద్ధి చేయనున్నారు.పెరుగుతున్న వసతుల లభ్యత రాష్ట్రంలో ప్రస్తుతం స్టార్‌ హోటళ్లలో 11,700 గదులు అందుబాటులో ఉండగా, ఈ సంఖ్యను 2028 నాటికి 50 వేలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఏపీటీడీసీ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రూ.12,565 కోట్ల పెట్టుబడితో హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు పలు ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా కొత్తగా 8,073 గదులు అందుబాటులోకి వస్తాయని అంచనా. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో హోటళ్ల నిర్మాణానికి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇతర దర్శనీయ ప్రాంతాల్లో ‘హోం స్టే’ విధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో 1,842 పాత ఇళ్లను గుర్తించి, పర్యాటకులకు సొంత ఇంటి అనుభూతి కలిగేలా వాటిని ఆధునికీకరిస్తున్నారు.పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం దృష్టి "రాష్ట్రంలో హోటళ్లు, రిసార్ట్‌ల్లో గదుల సంఖ్య 50 వేలకు పెరగాలి. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం దర్శనీయ ప్రాంతాల్లో అన్ని వసతులూ కల్పించాలి. వచ్చినరోజే తిరిగి వెళ్లిపోవాలన్న ఆలోచన పర్యాటకుల్లో రాకూడదు. రెండు, మూడు రోజులైనా ఉండాలనుకుంటేనే పర్యాటక రంగం అభివృద్ధి చెందినట్లు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలి" అని పర్యాటక శాఖపై ఫిబ్రవరి 14న జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.కెవాడియా, అయోధ్య వంటి ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్నాయి. కెవాడియాలోని రెండు టెంట్ సిటీలలో స్టార్ హోటల్ స్థాయి సౌకర్యాలు ఉండటంతో సర్దార్ పటేల్ విగ్రహాన్ని చూడటానికి వెళ్లేవారు వీటిలో బస చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. అయోధ్యలో కూడా రామమందిర ప్రతిష్ఠాపన సమయంలో వేలాది మంది భక్తులకు టెంట్ సిటీలలోనే వసతి కల్పించారు. ఈ నమూనాలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో కూడా పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM