|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 05:55 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ సంబరాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టింది.తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్యాయమని, అసలు బాధ్యులను వదిలి తమను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పిటిషన్లో పేర్కొన్నారు.విజయోత్సవ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్వహించినట్లు కేఎస్సీఏ తెలిపింది. "విజయాన్ని పురస్కరించుకుని వేడుకలు జరపాలని ప్రభుత్వమే పిలుపునిచ్చింది" అని పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పలువురు కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో విధానసౌధలో అభినందన కార్యక్రమం జరిగిందని గుర్తుచేశారు.అభిమానుల నియంత్రణ, సంబంధిత ఏర్పాట్ల బాధ్యత పూర్తిగా ఆర్సీబీ, ఈవెంట్ నిర్వాహకులు, పోలీసులదేనని కేఎస్సీఏ స్పష్టం చేసింది. తాము కేవలం వేదికను అద్దెకు ఇచ్చే సంస్థ మాత్రమేనని, కర్ణాటకలో క్రికెట్ను పర్యవేక్షిస్తామని, అభిమానుల ప్రవేశం లేదా వారిని నియంత్రించే బాధ్యత తమది కాదని పిటిషన్లో పేర్కొన్నారు. "గేట్ నిర్వహణ, జన సమూహ నియంత్రణ కేఎస్సీఏ బాధ్యత కాదు. అది ఆర్సీబీ, నిర్వాహకులు, పోలీసుల బాధ్యత" అని వారు తెలిపారు.
Latest News