|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 08:00 PM
ప్రభుత్వ పాలనలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు పౌర సేవలను మరిం సులభంగా, పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో పౌరసేవలను మొబైల్ ద్వారా అందిస్తోంది. సుమారుగా 500 పౌరసేవలను ప్రజలకు మొబైల్ ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ ఇవ్వాలని భావిస్తున్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానం తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
అయితే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి కుటుంబాలకు అందే సంక్షేమ పథకాల గురించి ఇందులో ప్రస్తావిస్తారా లేదా ఇతర వివరాలు ఏవైనా ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధితో పాటుగా దేశాభివృద్ధికి తోడ్పడే అంశాలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047పై నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన చంద్రబాబు నాయుడు.. ఆపరేషన్ సిందూర్ను ప్రశంసించారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు.
ఆంధ్రప్రదేశ్లోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తామని చంద్రబాబు నాయుడు తన ప్రజెంటేషన్లో వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దనున్నట్లువెల్లడించారు. విశాఖపట్నంలో నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించిన చంద్రబాబు.. అమరావతి, తిరుపతి, కర్నూలు నగరాలకు కూడా విశాఖ మోడల్ను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చంద్రబాబు నాయుడు కోరారు.
Latest News