|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:30 PM
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది. జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం ప్రకటించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 4 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకిందని, ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే మనకంటే ముందున్నాయని ఆయన తెలిపారు.నీతి ఆయోగ్ పదో పాలక మండలి సమావేశం అనంతరం సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో చేపట్టిన సంస్కరణలు, ప్రపంచవ్యాప్తంగా భారత్కు అనుకూలంగా మారుతున్న పరిస్థితులే ఈ వృద్ధికి కారణమని ఆయన పేర్కొన్నారు. "ప్రస్తుతం మనం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది" అని ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా అంచనాలను ఉటంకిస్తూ వివరించారు. "ఇదే ప్రగతిని కొనసాగిస్తే, మరో రెండున్నర, మూడేళ్లలో మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది" అని సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు.ప్రపంచ ఆర్థిక చిత్రపటంలో భారత్ కీలకమైన ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో ఈ ఘనత సాధించడం విశేషం. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు భారత్ వంటి దేశాల్లో కాకుండా స్వదేశంలోనే తయారు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సుబ్రహ్మణ్యం స్పందించారు. భవిష్యత్తులో అమెరికా సుంకాల విధింపు ఎలా ఉంటుందో స్పష్టత లేదని, అయినప్పటికీ, ఆ పరిస్థితులతో సంబంధం లేకుండా భారత్ తక్కువ ఖర్చుతో కూడిన తయారీ కేంద్రాన్ని అందిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Latest News