|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 06:40 PM
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా వాటాను కూడా ఏపీ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో క్రీడాకారులు, గ్రామీణ యువత కోసం ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ క్రమంలోనే కర్నూలులో క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కర్నూలు మండలం మునగలపాడులోని బాల సాయిబాబా స్కూల్ పక్కన మైదానాన్ని మంత్రి టీజీ భరత్ శనివారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఏసీఏ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కర్నూలు ఎంపీ నాగరాజు, ఇతర ఏసీఏ సిబ్బందితో కలిసి మంత్రి టీజీ భరత్ మునగలపాడు క్రికెట్ గ్రౌండ్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి టీజీ భరత్ ప్రతి నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మునగలపాడు క్రికెట్ స్టేడియం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మునగలపాడు క్రికెట్ గ్రౌండ్ పరిశీలన సందర్భంగా అక్కడ జరుగుతున్న లెవలింగ్ పనుల పురోగతి, ఫెన్సింగ్ ఏర్పాట్లు ఇతరత్రా పనుల తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంచి ఆర్కిటెక్టును నియమించుకుని స్టేడియం అభివృద్ధికి ప్రణాళిక రచించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో జూన్ ఏడో తేదీలోగా మునగలపాడు స్టేడియం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని ఏసీఏ ప్రెసిడెంట్ శివనాథ్ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా స్టేడియం నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
మరోవైపు మంత్రి టీజీ భరత్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను కలెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలోని భూమి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని పురపాలక శాఖ అధికారులకు స్పష్టం చేశారు. అక్కడ ఎకో పార్కు నిర్మాణానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు.
Latest News