|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 09:14 PM
టీమిండియా టెస్టు జట్టు పగ్గాలను శుభ్మన్ గిల్ అందుకున్నాడు. ఈ మేరకు శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బీసీసీఐ కార్యదర్శి సైకియాతో సమావేశమయ్యారు. అనంతరం టెస్టు జట్టుకు కెప్టెన్తో పాటు ఇంగ్లాండ్ టూర్కు భారత జట్టును ప్రకటించారు. అయితే ఇందులో భారత సెలక్టర్లు పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. గత ఆస్ట్రేలియా పర్యటనతో పోలిస్తే ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో పలు మార్పులు చేశారు.
ముఖ్యంగా టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని జట్టు నుంచి తప్పించారు. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో షమీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. కానీ ప్రస్తుతం కోలుకుని ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు. కానీ అతడిని ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక చేయలేదు. మరోవైపు హర్షిత్ రాణాను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
ఇది సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్పై కూడా వేటు వేశారు. ఇంగ్లాండ్ టూర్ కోసం సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల భారీగా బరువు తగ్గి ఫిట్నెస్పై ఫోకస్ చేశాడని వార్తలు వచ్చాయి. తీరా అతడిని జట్టులోకే ఎంపిక చేయలేదు సెలక్టర్లు. శ్రేయస్ అయ్యర్ను కూడా టెస్టు జట్టు కోసం పరిగణలోకి తీసుకోలేదు. శ్రేయస్ అయ్యర్ ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో మెరుగ్గానే రాణించినా.. తీవ్రమైన పోటీ కారణంగా అతడికి చోటు కల్పించలేకపోయామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. ఇక అర్షదీప్ సింగ్, సాయి సుదర్శన్లను తొలిసారి టెస్టు జట్టు కోసం ఎంపిక చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత కరుణ్ నాయర్కు కూడా జట్టులో చోటు దక్కింది.
ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
Latest News