![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:40 PM
ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నడుపుతున్నానని, పెట్టుబడులపై భారీ లాభాలు ఇస్తానని, తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు సరఫరా చేస్తానని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఓ ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరుకు చెందిన సత్తెనపల్లి హరీశ్కుమార్ అలియాస్ రిషి అలియాస్ రిషికుమార్ ఈ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడి చేతిలో ఏలూరు, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన పలువురు మోసపోయినట్టు తెలుస్తోంది.పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు శివారు వట్లూరు ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన హరీశ్కుమార్ కొన్నాళ్లుగా హైదరాబాద్లోని ప్రగతినగర్, రాయదుర్గం ప్రాంతాల్లో నివసిస్తున్నాడు. తాను చార్టర్డ్ అకౌంటెంట్నని, సొంతంగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వహిస్తున్నానని పలువురిని నమ్మించాడు. ట్రేడ్ బిజినెస్లో తనకు మంచి అనుభవం ఉందని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపాడు. ఈ క్రమంలో ఏలూరు శనివారపుపేటకు చెందిన వ్యాపారి పంది సాయికుమార్ను కూడా ఇలాగే మభ్యపెట్టాడు. విదేశాల్లో ఉద్యోగం, బంగారు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి, అతని వద్ద నుంచి ఆన్లైన్లో సుమారు రూ. కోటి వరకు వసూలు చేసి మోసగించాడు.సాయికుమార్ తాను మోసపోయానని గ్రహించి ఏలూరు పోలీసులను ఆశ్రయించారు. అక్కడి సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. వారు హరీశ్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News