![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:34 PM
అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) 'మినిట్మ్యాన్-3'ను విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాన్డెన్బెర్గ్ స్పేస్ బేస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల (సుమారు 24,000 కిలోమీటర్లు) అసాధారణ వేగంతో 4,200 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యమైన మార్షల్ దీవుల్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి ప్రయాణించిందని అధికారులు వెల్లడించారు.ఈ ప్రయోగం గురించి అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ జనరల్ థామస్ బుస్సెరీ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈ ఐసీబీఎం పరీక్ష అమెరికా సైనిక సంసిద్ధతకు, అణు సామర్థ్యానికి నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు, ఈ పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని, ఇది రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో భాగంగా నిర్వహించే పరీక్ష అని ఆయన స్పష్టం చేశారు.మినిట్మ్యాన్-3 క్షిపణిలో అత్యంత శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ అమర్చారు. అవసరమైతే దీనిలో అణు వార్హెడ్ను కూడా మోహరించే వీలుంది. గతంలో కూడా అమెరికా అనేకసార్లు ఈ క్షిపణి సామర్థ్యాలను పరీక్షించింది. గతేడాది నవంబర్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందు కూడా ఒకసారి దీనిని పరీక్షించినట్లు సమాచారం. 1970ల నాటిదైన మినిట్మ్యాన్ క్షిపణి వ్యవస్థ స్థానంలో 'సెంటెనిల్ సిస్టమ్'ను ప్రవేశపెట్టాలని అమెరికా యోచిస్తున్నప్పటికీ, మినిట్మ్యాన్-3 ఇప్పటికీ అమెరికా వాయుసేనకు అత్యంత నమ్మకమైన అస్త్రంగా కొనసాగుతోంది.
Latest News