ఇండియాలో జేఎన్ 1 వేరియంట్ విజృంభణ
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 07:18 PM

ఒకప్పుడు ఎంతో మంది ప్రాణాలు తీసి, ఎన్నో కుటుంబాలను రోడ్డుకీడ్చి, మరెంతో మంది జీవితాలను నాశనం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. ఇటీవల కాలంలో పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. భారత్‌లోనూ కొంత మంది దీని బారిన పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ముంబయి, చెన్నై, పుణే, అహ్మదాబాద్ నగరాల్లో ఈ కేసుల్లో సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండగా.. అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆరోగ్య అధికారులు ఆయా రాష్ట్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మరి దేశంలో ఎక్కడెక్కడ కేసులు నమోదు అవుతున్నాయి, అందులో ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కొత్తగా నమోదు అవుతున్న కేసుల వ్యాప్తికి జేఎన్ 1 వేరియంట్ కారణమని వైద్యులు గుుర్తించారు. ఈ వేరియంట్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. "వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్"గా ప్రకటించింది. అయతే 2023 డిసెంబర్ నెలలో JN.1 స్ట్రెయిన్‌కి సంబంధించిన కొత్త ఉపవేరియంట్లు LF.7 మరియు NB 1.5 ప్రధానంగా గుర్తించారు. ప్రస్తుతం ఇవే అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి.


ముంబైలో కోరలు చాచిన కోరనా..!


మహారాష్ట్రలోని ముంబై నగరంలో 95 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. జనవరి నుంచి రాష్ట్రంలో మొత్తం 106 కేసులు నమోదు కాగా.. ఈ నెలలోనే గణనీయమైన పెరుగుదల కనిపించిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కోరోనా బారిన పడి ఆస్పత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇన్‌ఫ్లూయెంజా, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న రోగులు అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు.


పుణే పరిస్థితి ఏంటంటే..?


పుణేలో యాక్టివ్ కేసులు ఏమీ లేవు. కానీ ఆరోగ్య శాఖ ముందు జాగ్రతగ్గా అక్కడి నాయుడు ఆస్పత్రిలో 50 పడకలను కరోనా బాధితుల కోసం సిద్ధం చేసింది. మే నెలలో ఒకే ఒక్క వ్యక్తికి కరోనా సోకిందని.. మంజరికి చెందిన 87 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్లు చికిత్స కూడా పొందాడని పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధిపతి డాక్టర్ నీనా బోరాడే పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు.


తమిళనాడులో పెరుగుతున్న కేసులు..!


తమిళనాడులోన పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో అనేక ఆస్పత్రులు అప్రమత్తం అయ్యాయి. ఇన్ఫెక్షన్ల కారణంగా అవయవ మార్పిడి, గుండె శస్త్రచికిత్స సహా అనేకమైన కీలక సర్జరీలను ఆలస్యం చేశారు. వైరల్ కేసుల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామినాథన్ తెలిపారు. అయితే కొవిడ్ కేసుల గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని.. కాకపోతే ఎక్కువగా జనాలు ఉన్న చోటుకు వెళ్లకూడదని సూచించారు. కరోనా ఎప్పుడూ పూర్తిగా పోలేదని.. కాకపోతే కాలాన్ని బట్టి ఎక్కువ, తక్కువ అవుతూ మన చుట్టే తిరుగుతోందన్నారు.


కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కొత్త కేసులు..!


కర్ణాటకలో 16 కొత్త కొవిడ్-19 కేసులు నిర్దారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒకే రోజు 7 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది కాలంలో సగటున నెలకు ఒక కేసు మాత్రమే నమోదు కాగా.. ఈ నెలలోనే కేసులు పెరిగినట్లు చెప్పారు. ఏడుగురు కూడా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


వైరస్ ఇప్పటికీ అంటువ్యాధిగానే..!


2023 మేలో కరోనా పూర్తిగా అంతం అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటికీ.. కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. భారత దేశంలో చాలా కేసులు నమోదు అవుతున్నప్పటికీ.. మరణాలు ఏమీ లేదని, భయపడాల్సిన అవసరం కూడా లేదని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు, గర్భిణీలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తరచుగూ చేతులు కడుక్కుని, మాస్కులు ధరిస్తూ.. సానిటైజేషన్ వాడాలని వివరిస్తున్నారు.

Latest News
K-pop album exports hit record $120 million in Jan-March Tue, Apr 28, 2026, 10:43 AM
Nothing like playing football with young friends: PM Modi shares glimpse of 'lovely Gangtok morning' Tue, Apr 28, 2026, 10:39 AM
China threat drives US missile defence rethink Tue, Apr 28, 2026, 10:35 AM
US bill targets threats to Hindu temples Tue, Apr 28, 2026, 10:29 AM
Man killed in low-intensity blast on Delhi-Rajpura rail track in Punjab Tue, Apr 28, 2026, 10:23 AM