|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:41 PM
తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు టీటీడీ ఉద్యోగులు సేవలు అందిస్తుంటారు.. ప్రధానంగా ఆలయంలోని క్యూలైన్లతో పాటుగా మిగిలినచోట్ల వారు విధుల్లో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో టీటీడీ సిబ్బంది భక్తుల విషయంలో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారనే ఫిర్యాదులు వచ్చాయి..ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలు చేస్తామని గతంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తిరుమలలో టీటీడీ ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్ విధానం అమల్లోకి వచ్చింది. నేమ్ బ్యాడ్జ్, ఐడీ కార్డులతో టీటీడీ ఉద్యోగుల విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయం, బోర్డు తీర్మానంతో తిరుమలలో నేమ్ బ్యాడ్జ్ ల విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టీటీడీ ఉద్యోగుల్లో కొందరికి మాత్రమే ఈ నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆ తర్వాత మెల్లిగా మిగిలిన ఉద్యోగులకు కూడా నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
టీటీడీ ఉద్యోగులందరికీ నేమ్ బ్యాడ్జ్ల విధానం తీసుకొస్తామని గతంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొంతమంది ఉద్యోగులు తిరుమలకు వచ్చే భక్తులతో సరిగా ప్రవర్తించడం లేద తన దృష్టికి వచ్చిందని.. భక్తులతో దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నేమ్ బ్యాడ్జ్ల ద్వారా అమర్యాదగా ప్రవర్తించే వారిని సులువుగా గుర్తించవచ్చని.. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలన్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే భక్తుల పట్ల అంకితభావంతో పనిచేయడానికి ఈ నేమ్ బ్యాడ్జ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. భక్తులతో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఈ నేమ్ బ్యాడ్జ్ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Latest News