|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 07:22 PM
దేశంలో తొలి బుల్లెట్ రైలు పనుల్లో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులపై రైల్వే మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే.. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కీలకఘట్టం పూర్తయింది. బుల్లెట్ రైలు దూసుకెళ్లే 300 కిలోమీటర్ల వయాడక్ట్ (రైల్వే వంతెన) పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ మధ్య పరుగులు పెట్టనున్న విషయం తెలిసిందే. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైల్వే లైనులో మొత్తంగా 12 స్టేషన్లు ఉండనున్నాయి. గుజరాత్లో 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో 4 స్టేషన్లు ఉంటాయి. 508.17 కిలోమీటర్ల రైలు మార్గంలో దాదాపు 21 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించే ముంబై స్టేషన్ పూర్తిగా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది.
ది నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు బాధ్యతలను నిర్వహిస్తోంది. 257.4 కిలోమీటర్లు ఫుల్ స్పాన్ లాంచిగ్ విధానంలో, 14 రివర్ బ్రిడ్జిలు స్పాన్ బై స్పాన్ పద్ధతిలో నిర్మిస్తున్నట్లు ది నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 401 కిలోమీటర్ల ఫౌండేషన్ పనులు జరిగాయి.
బుల్లెట్ ట్రైన్ తొలి ట్రయల్స్ను 2026లో చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ట్రయల్ రన్లో భాగంగా బుల్లెట్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుందని చెబుతున్నారు. ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానమని తెలిపారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతోనే నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు 2028 నాటికి పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు.
Latest News