|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 03:22 PM
యుద్ధ సామగ్రిని విక్రయించే శక్తులు ఎన్నటికీ శాంతిని కోరుకోవని, వారికి యుద్ధాలే కావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా శాంతిని ఆశిస్తే, ముందుగా ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం మూడు రోజుల్లోనే భారీ మొత్తంలో యుద్ధ సామగ్రిని విక్రయించారని కేఏ పాల్ ఆరోపించారు. మన దేశ జీడీపీలో మూడో వంతుకు సమానమైన ఆయుధాలను ఆయన ఆ దేశాలకు అమ్మారని, అలాంటి చర్యలకు పాల్పడే వారు యుద్ధాలను ఎలా ఆపగలరని పాల్ ప్రశ్నించారు. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ముందు తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారని పాల్ గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత తామే యుద్ధాన్ని ఆపామని ట్రంప్ అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటానికి, ట్రంప్ పరువు పోతుందనే కారణమేనని పాల్ ఆరోపించారు.ఈ నెల 24వ తేదీన సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో ఒక శాంతి సభను నిర్వహించనున్నట్లు కేఏ పాల్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల నుంచి ప్రజలు ఈ శాంతి సభకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. శాంతి ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పాల్ పేర్కొన్నారు.
Latest News