|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:51 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాధి రూపాయలు అక్రమంగా అమరావతిలోని చంద్రబాబు కరకట్ట ప్యాలెస్కు చేరుతున్నాయని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రతిఏటా నారావారి లిక్కర్ కమీషన్లు అక్షరాలా రూ.2,200 కోట్లు అని అన్నారు. డిస్టిలరీల నుంచి ఏడాదికి రూ.1000 కోట్లు సీఎం చంద్రబాబుకు, లిక్కర్ షాప్ల నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్కు రూ.1200 కోట్లు ముడుపులు అందుతున్నాని వెల్లడించారు. అయిదేళ్లలో ఏకంగా రూ.10వేల కోట్లకు పైగా లిక్కర్ ద్వారా దండుకుంటూ అతిపెద్ద స్కామ్ను నడిపిస్తున్న ఘనులు తండ్రీకొడులని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క డిస్టిలరీకి కూడా వైయస్ జగన్ హయాంలో అనుమతి లభించలేదు. గతంలో 4 డిస్టిలరీలకు కాంగ్రెస్ హయాంలో అనుమతిస్తే, మిగిలిన వాటన్నింటికీ చంద్రబాబే అనుమతిచ్చారు. దాదాపు 200 బ్రాండ్లు తయారు చేసే డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అలాంటిది డిస్టిలరీల నుంచి వైయస్ జగన్ లంచాలు తీసుకున్నాడని పచ్చి అబద్ధాలు చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించాడు. సూపర్ సిక్స్ అని చెప్పుకునే ఆరు పథకాలు అమలు చేయలేని అసమర్థుడు చంద్రబాబు. చంద్రబాబుకి పరిపాలన చేతకాక మా నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నాడు. పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడే కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు అని మండిపడ్డారు.
Latest News