సిక్కిం విలీనం భారత్‌కు ఎలా కలిసొచ్చింది
 

by Suryaa Desk | Fri, May 16, 2025, 08:03 PM

ఆకాశాన్ని తాకే హిమాలయ పర్వత శిఖరాలు, పచ్చని లోయలు, ప్రశాంతతకు నెలవైన సిక్కిం రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమై 50 వసంతాలు పూర్తయ్యాయి. 1975 మే 16న భారత యూనియన్‌లో 22వ రాష్ట్రంగా సిక్కిం చేరింది. భారతదేశ భద్రత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం పరంగా సిక్కిం విలీనం అనేది అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. కేవలం 7 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ హిమాలయ ప్రాంతం విలీనం కావడం వల్ల.. భవిష్యత్తులో ప్రయోజనాలు ఉంటాయని నాటి మన పాలకులు ఊహించారో లేదో తెలీదు కానీ.. సిక్కిం చేరిక మనకు ఎంతగానో ప్రయోజనకరంగా మారింది. ఎన్నో పర్యాటక ఆకర్షణలతో.. ఒకప్పుడు చోగ్యాల్ వంశీకుల పాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న సిక్కిం.. భారతదేశంలో ఎలా కలిసిపోయింది? ఈ విలీనం వల్ల అటు సిక్కిం, ఇటు భారతదేశం ఎలాంటి ప్రయోజనాలు పొందాయో చూద్దాం..


1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి.. సిక్కిం రాచరిక రాజ్యంగా కొనసాగింది. అయితే సిక్కింపై ఆంగ్లేయుల ప్రభావం చాలా ఉండేది. బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత.. సిక్కిం తన భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫలితంగా 1950లో ఇండో-సిక్కిం ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సిక్కిం తన అంతర్గత వ్యవహారాలను తాను చూసుకుంటూ.. విదేశీ సంబంధాలు, రక్షణ, కమ్యూనికేషన్ బాధ్యతలను భారతదేశానికి అప్పగించింది. ఓ రకంగా చెప్పాలంటే సిక్కింకు ఇది రక్షణ కవచం అన్నమాట. అయితే చోగ్యాల్ రాజు పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.


1970ల ప్రారంభంలో సిక్కింలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రజాస్వామ్యం కోసం, భారత్‌తో మరింత బలమైన సంబంధాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో 1974లో ఇండియా, సిక్కిం మధ్య ఒప్పందాలు జరిగాయి. 1975 ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సిక్కిం ప్రజలు భారతదేశంలో విలీనానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో భారతదేశంలో విలీనం కోరుతూ సిక్కిం అసెంబ్లీ తీర్మానం చేసింది. 1975 మే 16న చేపట్టిన 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం.. భారత యూనియన్‌లో 22వ రాష్ట్రంగా అధికారికంగా చేరింది.


సిక్కిం విలీనం కావడం వల్ల రక్షణ పరంగా మన దేశానికి అనేక కీలక ప్రయోజనాలు లభించాయని చెప్పొచ్చు. సరిహద్దు భద్రత బలోపేతమైంది. సిక్కిం మ్యాప్‌ను చూస్తే ఉత్తరాన చైనా (టిబెట్), పశ్చిమ దిక్కున నేపాల్, తూర్పున భూటాన్‌ ఉంటాయి. బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరువగా.. ఈ మూడు దేశాల మధ్య ఉన్న భౌగోళిక ప్రాంతం భారత్‌లో చేరడం వల్ల.. ఉత్తర సరిహద్దు వెంబడి భద్రత గణనీయంగా మెరుగుపడింది. ముఖ్యంగా చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో సిక్కిం ప్రాధాన్యత మరింత పెరిగింది. నాథు లా, జెలెప్ లా వంటి కీలక కనుమలు భారతదేశ ఆధీనంలోకి వచ్చాయి.


‘చికెన్ నెక్’ అనేది బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మధ్యనున్న భారత భూభాగం. భారత ప్రధాన భూభాగాన్ని, ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఈ కారిడార్.. చాలా సన్నగా ఉంటుంది. ఈ ప్రాంతంలో భారత భూభాగం వెడల్పు 25 కిలోమీటర్లకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఈ మధ్య బంగ్లాదేశ్ పాలకుడు యూనస్ చైనా పర్యటన సందర్భంగా.. చికెన్ నెక్ గురించి, ఈశాన్య రాష్ట్రాల గురించి ఏవేవో వ్యాఖ్యలు చేశాడు. తాజాగా నేపాల్ పర్యటనలోనూ ఈశాన్య రాష్ట్రాల గురించి ఏదో వాగాడు. ప్రస్తుతానికి ఈ సంగతి పక్కన బెడితే.. చికెన్ నెక్ ఏరియాకు, భారతదేశానికి సిక్కిం రక్షణ కవచంలా మారింది. చికెన్ నెక్ ప్రాంతాన్నే సిలిగురి కారిడార్ అని పిలుస్తారు.


చైనా సరిహద్దుకు చేరువగా.. మూడు దేశాల మధ్య ఉన్న ఈ చికెన్‌ నెక్‌ను కత్తిరిస్తే.. ఈశాన్య రాష్ట్రాలకు భారత ప్రధాన భూభాగంతో సంబంధాలు తెగిపోతాయనేది శత్రు దేశాల దురాలోచన. అయితే సిక్కిం విలీనం వల్ల హిమాలయాల్లో భారత్ స్థానం బలోపేతం కావడంతోపాటు.. చికెన్ నెక్ ప్రాంతంలో భద్రతపరంగా కలిసొచ్చింది. లేకపోతే సిలిగురి కారిడార్ భద్రత సవాల్‌గా మన దేశానికి మారేది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ సైతం చైనాకు చేరువ అవుతూ.. భారత్ పట్ల వ్యతిరేకతను పెంచుకుంటోంది. ఇక చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ నెక్ ఏరియాకు రక్షణ కవచంగా నిలుస్తోన్న సిక్కిం ప్రాధాన్యత రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.


భౌగోళికంగా ఎంతో వ్యూహాత్మకమైన స్థానంలో ఉన్న సిక్కింలో భారత సైన్యానికి సంబంధించిన అనేక కీలక స్థావరాలు ఉన్నాయి. 17వ మౌంటైన్ డివిజన్ లాంటి కీలక సైనిక విభాగాలు సిక్కింలో ఉన్నాయి. చుంగ్థాంగ్‌లో భారత సైన్యం కీలక ఫార్వర్డ్ స్థావరాలు ఉన్నాయి. ఇవి సరిహద్దు వెంబడి చైనా కదలికలను పర్యవేక్షించడానికి, ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి సహాయపడతాయి. చికెన్ నెక్ ప్రాంతంలోని సుక్నాలో త్రిశక్తి కార్ప్స్ ప్రధాన కార్యాలయం ఉంది. సిక్కిం కూడా దాని బాధ్యత ప్రాంతంలోకి వస్తుంది.


సిక్కిం పొందిన ప్రయోజనాలేంటి?


భారత్‌లో చేరడం వల్ల సిక్కిం సైతం గణనీయంగానే లబ్ధి పొందింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం లాంటి రంగాల్లో సిక్కిం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. సిక్కింలో ఎన్నో ప్రాంతాలు చూడదగ్గ పర్యాటక ప్రాంతాలుగా మారాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం సిక్కింకు ప్రత్యేక హోదా కల్పించారు. 1961 సిక్కిం సబ్జెక్ట్స్ రెగ్యులేషన్ కింద సిక్కిం వాసులకు, వారి వారసులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. భారతదేశంలో ఆదాయపన్ను మినహాయింపు ఉన్న ఏకైక రాష్ట్రం సిక్కిం మాత్రమే.

Latest News
IANS Year Ender 2025: As Pakistan sank, its army chief rose in power Fri, Dec 26, 2025, 05:01 PM
CEC Gyanesh Kumar meets Vice President Radhakrishnan Fri, Dec 26, 2025, 04:59 PM
Disrupted sleep cycles linked to aggressive breast cancer: Study Fri, Dec 26, 2025, 04:39 PM
IANS Year Ender 2025: Anti-obesity drive, generic drugs to remain key focus in 2026 Fri, Dec 26, 2025, 04:38 PM
Govt releases new BIS Standard for incense sticks to boost consumer safety Fri, Dec 26, 2025, 04:36 PM