|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 07:02 PM
భూగోళం భవిష్యత్తుపై జపాన్లోని టోహో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళనకరమైన విషయాలను వెల్లడించారు. సుమారు ఒక బిలియన్ సంవత్సరాల తరువాత భూమిపై ప్రాణవాయువు అదృశ్యమవుతుందని, తద్వారా ప్రస్తుతం ఉన్న జీవరాశి మనుగడ అసాధ్యంగా మారుతుందని తమ అధ్యయనంలో తేల్చారు. నాసా కు చెందిన గ్రహ నమూనాలను ఉపయోగించి చేసిన ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత సైంటిఫిక్ జర్నల్ 'నేచర్ జియోసైన్స్' లో 'ది ఫ్యూచర్ లైఫ్స్పాన్ ఆఫ్ ఎర్త్స్ ఆక్సిజనరేటెడ్ అట్మాస్ఫియర్' భూమి ఆక్సిజన్ సహిత వాతావరణ భవిష్య జీవితకాలం పేరుతో ప్రచురితమయ్యాయి.టోక్యోలోని టోహో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కజుమి ఒజాకి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం, సూర్యుడి వయసు పెరిగే కొద్దీ భూ వాతావరణంలో సంభవించే మార్పులను అంచనా వేయడానికి సుమారు 400,000 అనుకరణలు నిర్వహించింది. ఈ విశ్లేషణ ద్వారా భూమిపై ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పడిపోయే సమయం గురించి ఒక అంచనాకు వచ్చారు.కార్బన్ చక్రం క్షీణించిన తరువాత, భూ వాతావరణం అధిక మీథేన్, తక్కువ ఆక్సిజన్తో కూడిన ఆదిమ కాలం నాటి భూమి స్థితికి చేరుకుంటుందని పరిశోధన వెల్లడించింది. కిరణజన్య సంయోగక్రియ చేసే జీవుల విస్తరణ కారణంగా భూమి వాతావరణం ఆక్సిజన్తో సమృద్ధిగా మారిన 'గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్'కు ముందున్న పరిస్థితులను ఇది పోలి ఉంటుంది. ఒక కీలక దశకు చేరుకున్న తర్వాత, కొన్ని వేల సంవత్సరాల వ్యవధిలోనే భూమిపై ఆక్సిజన్ వేగంగా క్షీణిస్తుందని సిమ్యులేషన్లు అంచనా వేస్తున్నాయి. ఆక్సిజన్ తగ్గడంతో పాటు మీథేన్ వాయువు స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మానవులతో సహా సంక్లిష్టమైన ఏరోబిక్ జీవులు మనుగడ సాగించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తెలిపారు.గతంలో కొన్ని శాస్త్రీయ నమూనాలు, భూమిపై జీవరాశి మరో రెండు బిలియన్ సంవత్సరాల వరకు మనుగడ సాగిస్తుందని అంచనా వేశాయి. అయితే, ఈ నూతన అధ్యయనం ఆక్సిజన్ ఉత్పత్తి అంతమయ్యే సమయాన్ని మరింత ముందుకు తెచ్చింది. భూమిపై జీవరాశి అంతిమ వినాశం గురించి తెలిసినప్పటికీ, ఆక్సిజన్ క్షీణత ఎప్పుడు, ఎలా జరుగుతుందనే కచ్చితమైన వివరాలు ఇప్పటివరకు అస్పష్టంగానే ఉన్నాయని కజుమి ఒజాకి నొక్కిచెప్పారు. ఈ తాజా పరిశోధన, అధునాతన సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పిస్తోందని ఆయన వివరించారు.
Latest News