|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 07:35 PM
ఏపీలో ఎన్నిక నగారా మోగనుంది. శనివారం (మార్చి 16)న ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలోన్నీ ఎన్నికల మూడ్లోకి వచ్చేశాయి. అభ్యర్థులను సైతం ప్రకటిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, అనకాపల్లి ఇంఛార్జి పరుచూరి భాస్కరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ను కలిసేందుకు పలుసార్లు ప్రయత్నించాననీ.. అయితే ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదని భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిరాశతోనే పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు భాస్కరరావు తెలిపారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు అనకాపల్లి నియోజకవర్గం జనసేన ఇంఛార్జిగా పరుచూరి భాస్కర్రావు పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో పనిచేశారు. పొత్తులో భాగంగా టికెట్ జనసేనకే వచ్చింది. అయితే ఊహించని విధంగా పవన్ కళ్యాణ్.. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను అనకాపల్లి అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థిగా ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే కొణతాల జనసేనలో చేరారు. దీంతో నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి, తనకు అన్యాయం చేశారనే ఆవేదనలో పరచూరి భాస్కర్రావు ఉన్నారు.. టికెట్ రాలేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే కాపు కులమే తనకు టికెట్ రాకుండా అడ్డుపడిందని అప్పట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే కొణతాలను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ను కలిసేందుకు పరుచూరి భాస్కరరావు ప్రయత్నించినట్లు ఆయన మద్దతుదారులు, అనుచరులు చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఆ బాధతోనే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. మరోవైపు పరుచూరి అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉండటంతో మిగతా రెండు పార్టీలలో ఆయన చేరే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వైసీపీలోకి చేరతారనే వార్తలు వస్తున్నాయి.
Latest News