ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 07:44 PM

ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభించి మే 15వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే నాణ్యమైన క్వింటాల్‌ మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,090 చొప్పున చెల్లిస్తారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అహ్మద్‌బాబు మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో ఆర్‌బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు మార్క్‌ఫెడ్‌ చర్యలు చేపట్టింది.


రాష్ట్రంలో రబీ 2023–24లో 4.75 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 16.82 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని వ్యవసాయ శాఖ అంచనా. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా.. నెలాఖరు నాటికి ముమ్మరమవుతాయి. సీఎం యాప్‌ ద్వారా ప్రతిరోజు మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు. కనీస మద్దతు ధర విషయంలో రైతులకు అండగా నిలిచేందుకు క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చేసి కనీసం 85 వేల టన్నులను సేకరించేందుకు అనుమతిచ్చింది.


మొక్కజొన్న కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌బీకే అండ్‌ ఆర్‌) నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది. కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, తేమను కొలిచే మీటర్లు, డ్రయ్యర్లు, జల్లెడ, కుట్టు యంత్రాలు, వేయింగ్‌ మెషిన్లు వంటి వాటిని సమకూర్చే బాధ్యతను మార్కెటింగ్‌ శాఖకు అప్పగించింది. మొక్కజొన్న సేకరణకు అవసరమైన నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి సమీకరించుకునే వెసులుబాటును మార్క్‌ఫెడ్‌కు కల్పించింది.


అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు సకాలంలో నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి తిరిగి చెల్లిస్తుంది. మొక్కజొన్నను నిల్వ చేసుకునేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీలతో పాటు వ్యవసాయ, ఇతర గిడ్డంగులను సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే మినుము, పెసలు, వేరుశనగ, శనగ, జొన్నల సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


మరోవైపు హైబ్రీడ్‌ రకం జొన్నలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మార్కెట్‌ ధర మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులను ఆదుకొనేందుకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద వెంటనే హైబ్రీడ్‌ రకం జొన్నలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. హైబ్రీడ్‌ రకం జొన్నలు కనీస మద్దతు ధర క్వింటాలు రూ.3,180కు కొనుగోలుకు అనుమతినిచ్చింది. బుధవారం నుంచి ఆర్బీకేల ద్వారా జొన్న రైతుల రిజిస్ట్రేన్‌కు మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది.


రబీ సీజన్‌లో 2.38 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. హైబ్రీడ్‌ రకం క్వింటాలు రూ.3180గా, మల్దిండి రకం క్వింటాలు రూ.3,225గా ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రీడ్‌ రకం ఆహార అవసరాల కోసం, మల్దిండి రకం పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. హైబ్రీడ్‌ జొన్నల ధర మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాలు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధరకంటే మార్కెట్‌ ధర తక్కువ ఉండటంతో జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Latest News
Format of US-Iran talks still uncertain: Report Sat, Apr 11, 2026, 11:48 AM
Jaipur students launch AI platform for defence families​ Sat, Apr 11, 2026, 11:23 AM
Britain to hold talks on Strait of Hormuz next week: Report Sat, Apr 11, 2026, 11:11 AM
Bookings for helicopter services for Shri Kedarnath Yatra to start today Sat, Apr 11, 2026, 11:05 AM
IPL 2026: Dear Vaibhav, well done - Kohli's note to Sooryanavanshi Sat, Apr 11, 2026, 11:02 AM