బెయిల్‌పై కోడికత్తి శ్రీను విడుదల.. జైలు వద్ద ఉద్విగ్వ వాతావరణం
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:43 PM

కోడికత్తి శ్రీను.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైజాగ్ ఎయిర్‌పోర్టులో జగన్ మీద దాడి చేయడం అప్పట్లో పెను సంచలనం రేపింది. విపక్ష నేత మీద, అందులోనూ కేంద్ర బలగాల భద్రత మధ్యన ఉన్న ప్రదేశంలో దాడి జరగడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆ ఘటన మీద రాజకీయంగానూ పెద్ద రగడ జరిగింది. ఆ విషయాలన్నీ పక్కనబెడితే.. నాటి ఘటనలో అరెస్టైన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను అప్పటి నుంచి వైజాగ్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు.


అయితే ఘటన జరిగిన నాటి నుంచి జైలులో ఉన్న కోడికత్తి శ్రీను ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి కోడికత్తి శ్రీను విడుదలయ్యారు.ఈ సందర్భంగా జైలు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సుమారు ఐదేళ్ల తర్వాత కొడుకును చూసిన ఆనందంలో.. శ్రీనివాస్ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. శ్రీనివాస్ విడుదలకు కారణమైన న్యాయవాదులను , ఎస్సీ సంఘాల నేతలను హత్తుకుని తన కృతజ్ఞతను తెలియజేసుకున్నారు. ఐదేళ్లుగా కుటుంబానికి దూరంగా నిద్రలేని రాత్రులు గడిపాడని, న్యాయవాదులు, ప్రజాసంఘాల కృషితో ఎట్టకేలకు బెయిల్ మీద విడుదలయ్యాడని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు కేసు విషయంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.


వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శ్రీనివాస్ కోడికత్తితో వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయనపై దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయమైంది. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసును ఏపీ హైకోర్టు పలుసార్లు విచారించినప్పటికీ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో కొడుకును బయటకు తేలేక శ్రీనివాస్ కుటుంబం తల్లడిల్లిపోయింది. శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇటీవల ఆయన కుటుంబం నిరాహార దీక్షకు సైతం దిగింది. ఎట్టకేలకు ఇప్పుడు జైలు నుంచి శ్రీనివాస్ విడుదల కావటంతో అతని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు ఘటన జరిగిన నాటి నుంచి ఈ కేసులో కోడికత్తి శ్రీను కుటుంబానికి అండగా నిలుస్తూ వచ్చారు న్యాయవాది సలీం. ఎట్టకేలకు శ్రీనివాస్ విడుదల కావటంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో ఈ కేసును వాదించానని.. శ్రీనివాస్ తనకు సోదరుడు లాంటి వాడని సలీం అన్నారు. శ్రీనివాస్ తండ్రి సైతం కన్నీళ్లు నిండిన కళ్లతో న్యాయవాదిని హత్తుకుని ధన్యవాదాలు తెలియజేశారు.

Latest News
Patna police's traffic advisory on key routes ahead of Bihar Cabinet expansion Wed, May 06, 2026, 01:51 PM
Three killed in early morning blaze at Bhubaneswar apartment Wed, May 06, 2026, 01:45 PM
Centre raises sugarcane FRP: Karnataka BJP sees it as relief, slams state govt over unpaid dues Wed, May 06, 2026, 01:40 PM
Congress' newly elected MLAs to meet in Thiruvananthapuram on Thursday Wed, May 06, 2026, 01:39 PM
ISI link in Punjab twin blasts suspected; aimed to create panic ahead of Op Sindoor anniversary Wed, May 06, 2026, 01:38 PM