రికార్డు స్థాయిలో ఐదుగురికి భారతరత్న ఇచ్చిన మోదీ సర్కార్.. గతంలో బీజేపీ హయాంలోనే నలుగురికి!
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:33 PM

ఈసారి దేశంలో ఐదుగురు ప్రముఖులకు భారతరత్న అవార్డులు వరించాయి. అయితే సాధారణంగా ఒక ఏడాదిలో ముగ్గురికి భారతరత్న అవార్డులు అందిస్తారు. కానీ ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. భారతరత్న అవార్డులు ప్రకటించడం ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి కాగా.. ఇప్పటి వరకు ఐదుగురికి ఈ దేశ అత్యున్నత పౌరపురస్కారం ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే గతంలో ఒకే ఏడాదిలో నలుగురికి కూడా భారతరత్న అవార్డులు వరించాయి. అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోనే ఉండటం గమనార్హం.


అయితే మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా ఈ భారతరత్న అవార్డులు ప్రకటించిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించి రికార్డ్ సృష్టించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్‌తోపాటు మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ.. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, భారతదేశ హరిత విప్లవ పితామహుడు అయిన ఎంఎస్ స్వామినాథన్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇందులో నలుగురికి మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించగా.. ఎల్‌కే అద్వానీకి బతికి ఉండగానే ఈ అవార్డును ప్రకటించారు.


అయితే గతంలో అధికారంలో ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. నలుగురికి భారతరత్నను ప్రకటించింది. 1999లో అత్యధికంగా నలుగురు ప్రముఖులకు భారతరత్న అవార్డులను ప్రకటిస్తూ వాజ్‌పేయి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే 1999లో జయ ప్రకాష్ నారాయణ్, అమర్త్యసేన్, గోపీనాథ్ బోర్డోలోయ్, పండిట్ రవి శంకర్‌లకు భారతరత్న అవార్డును ప్రకటించారు. వీరిలో జయ ప్రకాష్ నారాయణ్, గోపీనాథ్ బోర్డోలోయ్‌లకు మరణానంతరం భారతరత్న రాగా.. అమర్త్యసేన్, పండిట్ రవి శంకర్‌లకు బతికి ఉండగానే ఈ గౌరవం దక్కింది. సాధారణంగా ఏటా గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తుండగా.. 1999 లో నలుగురికి ఇచ్చారు. తాజాగా మోదీ సర్కార్ ఐదుగురికి ఇచ్చి ఆ రికార్డును తిరగరాసింది.


భారతరత్న అవార్డును 1954 జనవరి 2 వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ వెంకట రామన్‌లకు తొలిసారిగా 1954లో భారతరత్న అవార్డులు లభించాయి. అయితే ఈ భారతరత్న అవార్డును మొదట్లో కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజా సేవ చేసిన వారికి మాత్రమే ఇచ్చేవారు. కానీ 2011 డిసెంబర్‌లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2 ప్రభుత్వం.. దానికి కొన్ని మార్పులు చేసింది. మానవ కృషికి సంబంధించిన ఏ రంగంలోనైనా విశేష సేవలు అందించిన వారికి భారతరత్నను ఇవ్వాలని నిర్ణయించింది.


Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM