|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:54 PM
చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలతో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పసలేదని చిన్న పిల్లాడు కూడా చెబుతాడని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ అడగలేదని, క్వాష్ పిటిషన్ వేశారని అనిత స్పష్టం చేశారు. ఏనాడూ రాజకీయాల వైపు చూడని నారా బ్రాహ్మణి ఒక్కరోజు బయటికి వచ్చి కొవ్వొత్తి పట్టుకునే సరికి వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా ఐటీకి, ఇన్ కమ్ టాక్స్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
"అమ్మా రోజా... నారా బ్రాహ్మణి గారు ఏం చదువుకున్నారో తెలుసా? చెరువు కట్ట దగ్గర చదువు అనుకున్నావా? ఇంటర్ ఫెయిలైన నువ్వు నారా బ్రాహ్మణికి చదువు చెప్పిన గురువుల గురించి మాట్లాడుతున్నావు చూడూ... నిజంగా ప్రజాస్వామ్యానికి హేట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే నీలాంటి వాళ్లతో కూడా మాట్లాడించే వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఇచ్చింది మరి. కానీ, మాట్లాడేముందు మన అర్హతలేంటో తెలుసుకుని మాట్లాడాలి. మనకంటూ కొన్ని నైతిక విలువలు ఉండాలి. స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చదివిన బ్రాహ్మణి ఎక్కడ, ఇంటర్ ఫెయిలైన నువ్వెక్కడ? బ్రాహ్మణి తమ కంపెనీల ద్వారా వేలమందికి ఉపాధి కల్పిస్తున్నారు" అంటూ అనిత స్పష్టం చేశారు.