|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 07:43 PM
ప్రయాణికులతో వెళ్తోన్న విమానం కూలిపోయి.. 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన బ్రెజిల్లో శనివారం చోటుచేసుకుంది. అమెజాన్ అడవులకు సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బార్సిలోస్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మృతిచెందినట్టు బార్సిలోస్ గవర్నర్ విల్సన్ లిమా ట్వీట్ చేశారు. విమాన ప్రమాదం నుంచి ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు, దుర్ఘటనపై తక్షణమే స్పందించడానికి ప్రభుత్వ అధికారులు నిరాకరించారు.
స్థానిక మీడియా కథనాలు ప్రకారం.. బ్రెజిల్కు చెందిన ఎంబ్రియర్ సంస్థ తయారుచేసిన రెండు ఇంజిన్ల టర్బోప్రోప్ ఈఎంబీ-110 విమానం అమెజానోస్ రాష్ట్ర రాజధాని మనౌస్ నుంచి ఉత్తర అమెజాన్ ప్రావిన్సులు బార్సిలోస్కు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. రెండు నగరాల మధ్య ప్రయాణానికి గంటన్నర పడుతుందని పేర్కొంది. ఈ విమానం అమెజాన్ ఉపనది రియో నెగ్రో సమీపానికి చేరుకున్న సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ప్రదేశానికి సమీపంలో పలు జాతీయ పార్కులు, ఇతర రక్షణ ప్రాంతాలు ఉన్నాయని తెలిపింది. మనౌస్ ఏరోటాక్సీ విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా స్పోర్ట్స్ ఫిషింగ్ కోసం ఈ ప్రాంతానికి వెళుతున్న బ్రెజిలియన్లు అని రాష్ట్ర భద్రతా కార్యదర్శి వినిసియస్ అల్మేడా పేర్కొన్నారు. బాధితుల్లో అమెరికా పౌరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.