|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 09:19 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చారు. మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు సీఎం దంపతులు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. సీఎం జగన్ ఇవాళ రాష్ట్రంలో శాంతిభద్రతలు, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఈ వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం) విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అందుతోంది. అపాయింట్మెంట్ దొరికితే బుధవారం లేకపోతే ఈ వారంలోనే జగన్ ప్రధానిని కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. 13న ఢిల్లీ, 14న నిడదవోలు, 15న విజయనగరం పర్యటనలపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత వస్తుంది అంటున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళితే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాతో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా మాత్రం హస్తిన పర్యటన ఖరారు కాలేదు. అపాయింట్మెంట్ ఖరారైతే వస్తే వెంటనే ఢిల్లీ వెళ్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. చంద్రబాబు అరెస్టు, స్కిల్ డెవల్పమెంట్ స్కాం గురించి వివరిస్తారని చెబుతున్నారు. ఈ వారంలోనే నిడదవోలు, విజయనగరం పర్యటనలు కూడా ఉన్నాయి. అయితే ఢిల్లీ పర్యటనపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Latest News