|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 07:02 PM
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 15 నుంచి ఆరోగ్య సురక్ష నిర్వహించనుంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకాధికారి యాదాల అశోక్బాబు చెప్పారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలోని 15,005 సచివాలయాల్లో ఏఎన్ఎంలు, ఆశ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారన్నారు.
అనంతరం ఈ నెల 30 నుంచి అక్టోబర్ 30 వరకు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు సేవలందిస్తారని తెలిపారు. ఈ శిబిరాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. 14 రకాల పరీక్షలు, 105 రకాల మందుల పంపిణీ చేస్తారని.. స్పెషాలిటీ వైద్యం అవసరమని గుర్తిస్తే వెంటనే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు తరలించి సేవలందిస్తారని తెలిపారు. ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి.. వాటిని పరిష్కరించడానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎంలు వారి పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. వీరు ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే చేస్తారు.. దీని కోసం ఓ యాప్ను రూపొందిస్తున్నారు.
ఈ సర్వేలో గుర్తించిన ఆరోగ్య సమస్యలున్న ప్రజలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. అలాగే ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇస్తారు. ఇందు కోసం రూ.66.65 కోట్ల విలువ చేసే 162 రకాల మందులు, 18 సర్జికల్ పరికరాలు, ఎమర్జెన్సీ కిట్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి వైద్య శిబిరాల నిర్వహణ మొదలయ్యే నాటికి అన్ని ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తారు. మొత్తం 10,032 విలేజ్ క్లినిక్స్, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
ప్రతి క్యాంప్నకు సంబంధిత పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ వైద్యులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 342 మంది స్పెషలిస్ట్ వైద్యులను గుర్తించారు. కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 11 నుంచి కంట్రోల్ రూమ్ల నుంచి వైద్యులు, మందులు, డయగ్నోస్టిక్స్ లభ్యత వంటి ఇతర అంశాలపై పర్యవేక్షణ మొదలవుతుంది. ఈ నెల 15 నుంచి కార్యక్రమంపై వాలంటీర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. 16 నుంచి ప్రజల్లో ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ఇంటింటి సర్వే.. 30న వైద్య శిబిరాల నిర్వహిస్తారు.
శిబిరాల్లో వైద్యుల కన్సల్టేషన్ తర్వాత ఎవరికైనా తదుపరి వైద్యం అవసరమైతే దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపుతారు. ఆస్పత్రుల్లో వారికి ఉచితంగా చికిత్స చేస్తారు. ఈ కార్యక్రమంపై వాలంటీర్లు 15 రోజుల పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Latest News