ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వార్ 2'లో ఎన్టీఆర్ లుక్‌పై స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అదాజానియా

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 10:29 AM

భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2'. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్‌పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సినిమాకు స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అదాజానియా.. ఎన్టీఆర్ లుక్ గురించి, ఆయనతో పనిచేసిన అనుభవం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ అప్రయత్నంగా ప్రదర్శించే సహజమైన బలాన్ని, పౌరుషాన్ని నిలుపుతూనే, ఆయన పాత్రకు వాస్తవికతను జోడించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.'వార్ 2' కోసం ఎన్టీఆర్‌తో తొలిసారి పనిచేయడం ఒక కొత్త అనుభూతినిచ్చిందని, అదొక అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని అనైతా తెలిపారు. "ఎన్టీఆర్ గదిలోకి అడుగుపెడితే చాలు, అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఓ విద్యుత్ ప్రవాహంలాంటి శక్తి సంచరిస్తుంది. అది ఆర్భాటంగానో, కావాలని ప్రదర్శించేదిగానో ఉండదు, అదొక అయస్కాంత శక్తి లాంటిది" అని ఆమె వివరించారు. "కేవలం తన ఉనికితోనే వాతావరణాన్ని ఉత్తేజపరిచే అరుదైన సామర్థ్యం ఆయన సొంతం. ఆ తర్వాత ఆయన చిరునవ్వు, ఆప్యాయత, తాను పోషిస్తున్న పాత్ర పట్ల ఆయనకున్న లోతైన, ప్రశాంతమైన ఆత్మవిశ్వాసం మనల్ని కట్టిపడేస్తాయి. తాను ఎవరో ఆయనకు మొదటి నుంచే స్పష్టంగా తెలుసు" అని అనైతా ప్రశంసించారు.ప్రముఖ ఫిల్మ్‌మేకర్ హోమీ అదాజానియా భార్య అయిన అనైతా.. ఎన్టీఆర్ లుక్ గురించి వివరిస్తూ "ఆయన లుక్‌ను వాస్తవికతకు దగ్గరగా ఉంచాలనుకున్నాను. అదే సమయంలో ఆయన అప్రయత్నంగా ప్రదర్శించే ఆ తిరుగులేని బలాన్ని, పౌరుషాన్ని నిలబెట్టుకోవాలి. ఆయన ఉనికిలో ఒక విధమైన సహజత్వం ఉంటుంది. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా ఆయన కనిపిస్తారు" అని అన్నారు. "ఈ భావననే శక్తివంతమైన, నిరాడంబరమైన వార్డ్‌రోబ్‌గా మార్చాం. లెదర్, రగ్డ్ జాకెట్లు, బలమైన సిల్హౌట్‌లు ఉపయోగించాం" అని ఆమె తెలిపారు.ఎన్టీఆర్ స్టైలింగ్‌లో ఎలాంటి అనవసరపు హంగులు, ఆర్భాటాలు ఉండవని అనైతా స్పష్టం చేశారు. "కేవలం తన పని తాను చూసుకుపోయే వ్యక్తిత్వం ఆయనది. ఆయన స్టైలింగ్ కూడా దీన్నే ప్రతిబింబిస్తుంది. సూటిగా, ప్రభావవంతంగా, ఎలాంటి మొహమాటం లేకుండా ఉంటుంది" అని ఆమె వివరించారు.ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. 'వార్ 2'లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు ఒకరినొకరు ఢీ కొట్టబోతున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.2019లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'వార్' చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఆ యాక్షన్ థ్రిల్లర్, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఇది మూడవ చిత్రంగా నిలిచింది. అందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించగా, వాణీ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటించారు. దారి తప్పిన తన మాజీ మెంటార్‌ను అంతమొందించేందుకు నియమితుడైన ఒక భారతీయ 'రా' ఏజెంట్ కథ అది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa