లోకనాయకుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణిరత్నం కలయికలో ముప్పై ఏడేళ్ల తర్వాత రూపుదిద్దుకుంటున్న చిత్రం 'థగ్ లైఫ్'. ఈ భారీ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్రిష, శింబు, అభిరామి, నాజర్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమల్ హాసన్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.'థగ్ లైఫ్' గురించి మాట్లాడుతూ, "నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. 'థగ్ లైఫ్' కూడా మనసుపెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన బృందంతో చేసిన సినిమా. ఇలాంటి గొప్ప సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా 'నాయకుడు' కంటే పెద్ద విజయం సాధిస్తుంది, ఇది నా ప్రామిస్. ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ నుంచి ఉన్న ఉత్సాహం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను తెలుగులోనే స్టార్గా ఎదిగాను. స్టార్గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. జూన్ 5న సినిమా వస్తోంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా వేడుక చేసుకుందాం" అని కమల్ హాసన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
![]() |
![]() |