లోకనాయకుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణిరత్నం కలయికలో వస్తున్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష, శింబు వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సంచలనం సృష్టించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డికి చెందిన శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది.దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, "కమల్ హాసన్ గారితో 'నాయకుడు' సినిమా చేశాను. 'మౌనరాగం' పూర్తయ్యాక నిర్మాత ముక్తా శ్రీనివాసన్ గారు ఒక హిందీ సినిమా క్యాసెట్ ఇచ్చి తమిళంలో రీమేక్ చేయమన్నారు. నాకు రీమేక్పై ఆసక్తి లేదని చెప్పాను. ఇదే మాట కమల్ గారికి చెప్పమన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇదే విషయం చెప్పగా, 'నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ సినిమా చేద్దాం' అన్నారు. అలా 'నాయకుడు' మొదలైంది. 'థగ్ లైఫ్' కూడా ఇలాగే మొదలైంది. కమల్ గారే ఫోన్ చేసి ఇద్దరం కలిసి సినిమా చేద్దామని చెప్పారు. ఆయనతో ఇన్నేళ్ల తర్వాత రెండో సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం. 'నాయకుడు' సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆయనలో ఏ మార్పు లేదు. దర్శకుడికి ఏం కావాలో అర్థం చేసుకుని సహకరించే హీరో కమల్," అని కొనియాడారు.
![]() |
![]() |