ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘స్పిరిట్’ లో మారనున్న హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 06:36 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’ గురించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కథానాయికగా తొలుత బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకునేను ఎంపిక చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను తీసుకునే అవకాశాలపై చిత్ర బృందం చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.‘కల్కి 2898 ఏడీ’ సినిమా ద్వారా ప్రభాస్‌తో కలిసి నటించిన దీపిక, ‘స్పిరిట్’లో కూడా ఆయన సరసన కనిపించనుందని అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి దీపిక కొన్ని షరతులు విధించినట్లు, అవి నిర్మాతలకు ఆమోదయోగ్యంగా లేకపోవడంతోనే ఆమె ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రోజుకు 8 గంటల పనివేళలు, రూ. 20 కోట్ల భారీ పారితోషికం, సినిమా లాభాల్లో వాటా వంటి డిమాండ్లతో పాటు, తెలుగులో డైలాగులు చెప్పేందుకు ఆమె నిరాకరించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ షరతులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇవి సమంజసమేనని అంటుంటే, మరికొందరు మరీ ఎక్కువని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇటీవల దీపిక తల్లి కావడంతో, కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి, మాతృత్వానికి సమయం కేటాయించాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా చెబుతున్నారు.ప్రస్తుతం దీపిక స్థానంలో ‘స్పిరిట్’ చిత్ర బృందం కన్నడ నటి రుక్మిణి వసంత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్ 2019లో ‘బిర్బల్ ట్రిలాజీ’ అనే కన్నడ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. 2023లో విడుదలైన ‘సప్త సాగరదాచే ఎల్లో’ (సైడ్ ఏ & సైడ్ బీ) చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు, ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా లభించింది. తెలుగులో కూడా నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో రుక్మిణి ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రంలో అవకాశం వస్తే, రుక్మిణి కెరీర్‌కు ఇది పెద్ద బూస్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com