కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బాటలో.. అదే ఇండస్ట్రీకి చెందిన హీరో విశాల్ కూడా నడవబోతున్నాడనేలా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విజయ్ స్థాపించినట్లుగా విశాల్ కూడా నూతన పార్టీని స్థాపించి.. రానున్న తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో.. తాజాగా విశాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఓ లేఖను విడుదల చేశారు. నూతన పార్టీ అంటూ వస్తున్న వార్తలకు ఇందులో ఆయన క్లారిటీ ఇచ్చారు. అవన్నీ రూమర్స్గా ఆయన కొట్టిపారేశారు. విశాల్ విడుదల చేసిన లేఖలో.. ‘‘నన్ను అభిమానిస్తున్న తమిళనాడు ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నటుడిగా, సమాజసేవకుడిగా నన్ను గుర్తించి.. ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు సేవ చేయాలని, కష్టాలలో ఉన్నవారికి సాయం చేయాలనే లక్ష్యంతోనే నా ఫ్యాన్స్ క్లబ్ను నిర్వహిస్తున్నా. దానిని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి జిల్లాల వారిగా, నియోజక వర్గాల వారిగా విస్తరించాలని నిర్ణయించాం. మా అమ్మ పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్’ ద్వారా.. నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం అందిస్తున్నాం. అలాగే షూటింగ్లకు వెళ్లినప్పుడు ఆ పరిసర ప్రాంతాలలోని ప్రజల కష్టాలు, అవసరాలను తెలుసుకుని.. వారికి తగిన విధంగా సాయం చేస్తూ, వారికున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నాం. నేను చేస్తున్న ఈ సంక్షేమ పనులతో ఎప్పుడూ కూడా రాజకీయ లబ్ధిని ఆశించలేదు. అయితే.. భవిష్యత్తులో ప్రజల కోసం గొంతెత్తేందుకు వెనకాడను’’ అంటూ విశాల్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa