ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్' మొదటి పార్టు 'సలార్: సీజ్ ఫైర్' ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మొదటి పార్టులో ప్రభాస్ ని చాలా తక్కువ సమయం చూపించారని ప్రభాస్ అభిమానులు కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదట 20 నిమిషాల తరువాత మాత్రమే ప్రభాస్ కనిపిస్తారు, అలాగే రెండో సగంలో కూడా ఒక పెద్ద పోరాట సన్నివేశంలో తప్పితే రెండో సగంలో కూడా ప్రభాస్ నిడివి చాలా తక్కువగా ఉంటుంది.అయితే ఈ మొదటి పార్టులో ఎన్నో సందేహాలు ప్రేక్షకులకి ఉండిపోయాయి, అవన్నీ తీరాలంటే 'సలార్' రెండో పార్టుకోసం ఎదురు చూడాల్సిందే. అయితే ఈ రెండో పార్టు ఎప్పుడు ఉంటుంది అనేది ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రభాస్ మొదటి పార్టులో తక్కువగా కనపడి, రెండో పార్టులో మొత్తం అతనిదే అని అంటున్నారు. అయితే ఈ రెండో పార్టు షూటింగ్ అయిపోయిందని, ఎదో కొంచెం మాత్రమే మిగిలి ఉందని ఒక టాక్ నడుస్తోంది. ఒకవేళ రెండో పార్టు షూటింగ్ అసలు కాలేదు అంటే, ఎప్పుడు షూటింగ్ మొదలెడతారు అనే ప్రశ్న కూడా వస్తోంది.దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే ఈ రెండో పార్టు ఇప్పుడిప్పుడే చేసేది లేదని నిర్మాతలకి, ప్రభాస్ కి కూడా చెప్పినట్టు ఒక వార్త ప్రచారంలో వుంది. ఎందుకంటే ప్రశాంత్ ఒక సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చెయ్యడానికి ఎప్పుడో ఒప్పుకున్నారు, ఇప్పుడు ఆ సినిమా చెయ్యాలని చూస్తున్నారు. అలాగే ఆ తరువాత మళ్ళీ 'కేజీఎఫ్' స్టార్ యాష్ తో ఇంకో సినిమా చెయ్యాల్సి ఉందని, ఈలోపు ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ఇద్దరూ కాళీగా ఉంటే అప్పుడు రెండో పార్టు గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు విడుదలైన 'సలార్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత కలెక్షన్స్ చేస్తుంది అనే విషయం పైన కూడా రెండో పార్టు ఆధారపడి వుంది అని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్టు లేనట్టే అని పరిశ్రమలో టాక్. ప్రేక్షకులకి వచ్చిన ఎన్నో సందేహాలకు ఇక ఇప్పుడిప్పుడే తీరేట్టు కనపడటం లేదు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ అతని కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యేసరికి మూడు నాలుగు సంవత్సరాలు అయినా పడుతుంది అని అంటున్నారు. మరి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa