తాను హీరోగా నటించి, నిర్మించిన ‘చిత్తా’ చిత్రం బాగుందనే విషయాన్ని తెలుసుకుని సూపర్స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా.. చెన్నై వచ్చిన తర్వాత సినిమా చూస్తానని చెప్పారని హీరో సిద్ధార్థ్ అన్నారు. ఆయన హీరోగా నటించి, సొంతంగా నిర్మించిన ‘చిత్తా’ చిత్ర థ్యాంక్స్ గివింగ్ మీట్ను గురువారం చెన్నై నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ... ‘చిత్తా’ చిత్రం నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’లోని మున్నా పాత్రతో రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేశాను. ఈ చిత్రం విడుదలై ఆగస్ట్ నెలతో 20 యేళ్ళు గడిచిపోయాయి. ఇపుడు ‘చిత్తా’ సినిమా పాత్ర మరో 20 యేళ్ళు నన్ను ఇండస్ట్రీలో కొనసాగేలా చేస్తుంది. తొలి ఐదు రోజులు వచ్చిన కలెక్షన్ల కంటే ఆరో రోజు వచ్చిన వసూళ్ళు అధికం. ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సమాజానికి ఒక మంచి సదేశం ఇచ్చే చిత్రాన్ని నిర్మించినందుకు ఒక నిర్మాతగా, అలాంటి సినిమాలో హీరోగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాను చూసిన నా గురువులు కమల్ హాసన్, మణిరత్నం వంటివారు అభినందించారు. ఆ అభినందనలు నాకెప్పుడూ ప్రత్యేకమే. తలైవా రజనీ సార్ కూడా త్వరలో సినిమా చూస్తానని కాల్ చేసి అభినందించారు. సినిమాను ఆదరిస్తూ.. మళ్లీ నన్ను నిలబెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa