ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పని మొదలుపెడితే ప్రాణం పెట్టి చేస్తారని తండ్రి చిరంజీవి గురించి చెప్పిన సుస్మిత

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 09:52 PM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. సాహు గారపాటితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల తన తండ్రితో కలిసి పనిచేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేర్చుకోవాలనే తపన ఉంటే తన తండ్రి నుంచి ప్రతిరోజూ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఆమె అన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచే చిరంజీవితో పనిచేయడం ద్వారా నేర్చుకున్న పాఠాల గురించి ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నానని సుస్మిత తెలిపారు.ఏదైనా ఒక పని మొదలుపెడితే, దానికి మన జీవితాన్ని అంకితం చేయాలి. నిజాయతీగా, కష్టపడి పనిచేయాలి అనే విషయాన్ని నాన్న నుంచే నేర్చుకున్నాను. ఇంట్లో మాతో ఎంతో ప్రేమగా, సరదాగా ఉంటారు. కానీ, ఒకసారి సెట్‌లో అడుగుపెట్టారంటే ఆయన ఏకాగ్రత మొత్తం పాత్రపైనే ఉంటుంది. ఈ రోజుకీ తన మొదటి సినిమాకు సిద్ధమైనట్టే సన్నద్ధమవుతారు అని ఆమె వివరించారు. ఈ అంకితభావమే ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆమె అభిప్రాయపడ్డారు.సినిమాకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ను నిర్మాతలు పంచుకున్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని తెలిపారు. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను ఎంతగానో ఆస్వాదించారని, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగిన 'క్లీన్ ఫిల్మ్' అని ప్రశంసించినట్లు వెల్లడించారు. ఈ రిపోర్ట్ పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.తెలుగు సినీ పరిశ్రమలోని ఇద్దరు అగ్ర నటులు, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో 'మన శంకర వరప్రసాద్ గారు'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్ లపై ఒక ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించారు. ఈ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.'సైరా నరసింహారెడ్డి', 'గాడ్‌ఫాదర్' చిత్రాల తర్వాత నయనతార మరోసారి చిరంజీవితో కలిసి నటిస్తుండటం విశేషం. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టారు. ఎస్. కృష్ణ, జి. ఆదినారాయణ కథను అందించారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa