తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) 2025-27 కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో ఉన్న ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు నేతృత్వంలోని 'ప్రోగ్రెసివ్ ప్యానెల్', మరోవైపు సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలోని 'మన ప్యానెల్' మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.ఈ ఎన్నికల్లో మొత్తం 3,355 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో నిర్మాతల విభాగం నుంచి 1,703 మంది, డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి 631 మంది, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి 916 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా నాలుగు సెక్టార్లకు ఛైర్మన్లను, 44 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం ఎన్నికైన సభ్యులు ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.నిబంధనల ప్రకారం, ఈసారి అధ్యక్ష పదవి ఎగ్జిబిటర్ల సెక్టార్కు కేటాయించబడింది. దీంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి. సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గత కమిటీ పదవీకాలం జులై 2025లోనే ముగియగా, ఆరు నెలల ఆలస్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సి. కళ్యాణ్ వంటి సీనియర్ నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుత పోలింగ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa