‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంపై దర్శకుడు సాయిలు కంపాటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, తన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతానని సంచలన ప్రకటన చేశారు. సినిమా విజయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, దయచేసి ఎవరూ నెగెటివ్ ప్రచారం చేయవద్దని ఆయన కోరారు.అఖిల్ రాజ్, తేజస్విని రావు జంటగా నటించిన ఈ చిత్రానికి ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో కిరణ్ అబ్బవరం చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత వేణు ఉడుగుల మాట్లాడుతూ.. "7/జీ బృందావన్ కాలనీ, RX 100, బేబీ వంటి కల్ట్ ప్రేమకథల సరసన ఈ సినిమా నిలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటారు" అని ధీమా వ్యక్తం చేశారు.ఖమ్మం-వరంగల్ సరిహద్దులోని ఓ గ్రామంలో 2004లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రాజు అనే యువకుడు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్టు ఊహించుకుంటూ జీవిస్తాడు. వారి ప్రేమకథ ఎందుకు విషాదాంతంగా ముగిసింది అనేదే ఈ చిత్రం. 15 ఏళ్ల పాటు ఓ జంట అనుభవించిన నరకాన్ని ఈ కథలో చూపిస్తున్నామని దర్శకుడు తెలిపారు.శివాజీ రాజా, అనిత చౌదరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రేక్షకులకు సినిమాను మరింత చేరువ చేసేందుకు మేకర్స్ టికెట్ ధరలను కూడా తగ్గించారు. సింగిల్ స్క్రీన్లలో రూ.99, మల్టీప్లెక్స్లలో రూ.105గా ధరలను నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa