ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంకేతిక హంగులతో రీ-రిలీజ్‌కు సిద్ధమైన ‘కొదమసింహం’

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 08:40 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ట్రెండ్‌సెట్టర్ చిత్రాలలో ‘కొదమసింహం’కు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు తెరపై వచ్చిన పూర్తిస్థాయి కౌబాయ్ చిత్రంగా అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు కొత్త హంగులతో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని 4K క్వాలిటీతో రీ-మాస్టర్ చేసి, నవంబర్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. “కొదమసింహం నా కెరీర్‌లో ఒక సాహసోపేతమైన ప్రయాణం. ఇది నాకొక మరపురాని ఆల్బమ్ కూడా. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని 4Kలో రీ-మాస్టర్ చేసి నవంబర్ 21న థియేటర్లలోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి కోసం రీ-రిలీజ్ ట్రైలర్‌ను పంచుకుంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.కె. మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు, రాధ, బాలీవుడ్ నటుడు ప్రాణ్, కైకాల సత్యనారాయణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. రామా ఫిలింస్ బ్యానర్‌పై కె. నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖ రచయితలు ఈ చిత్రానికి పనిచేశారు.ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఈ చిత్రాన్ని 4K రీస్టొరేషన్‌తో పాటు 5.1 సౌండ్‌తో డిజిటల్ రీ-మాస్టరింగ్ చేశారు. మెగాస్టార్‌ను కౌబాయ్ గెటప్‌లో, ఆయనదైన స్లిక్ యాక్షన్‌తో మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa