మెగాస్టార్ చిరంజీవి పుట్టుకతోనే ఒక యోధుడని, ఆయన అనుకుంటే తప్ప ఆయనకు రిటైర్మెంట్ అనేదే ఉండదని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 47 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. దీనిపై స్పందిస్తూ, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.సోమవారం నాటికి చిరంజీవి నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి 47 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "మా పెద్ద అన్నయ్య 'ప్రాణం ఖరీదు' సినిమాలో హీరోగా నటించిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు మేం నెల్లూరులో ఉండేవాళ్లం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కనకమహల్ థియేటర్కు వెళ్లి సినిమా చూసిన ఆనందం మాటల్లో చెప్పలేనిది" అని పేర్కొన్నారు. 47 ఏళ్లలో అన్నయ్య ఎన్నో శిఖరాలు అధిరోహించినా, ఆయనలోని వినయం, ఇతరులకు సాయం చేసే గుణం మాత్రం మారలేదని ప్రశంసించారు.అంతకుముందు, మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. 1978 సెప్టెంబర్ 22న 'ప్రాణం ఖరీదు' చిత్రంతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే తాను 'చిరంజీవి'గా మారానని తెలిపారు. తనను నటుడిగా నిలబెట్టి, మెగాస్టార్గా ఆదరించిన తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తనకు వచ్చిన అవార్డులు, గౌరవాలు ప్రేక్షకుల అభిమానానికి ప్రతీకలని, ఈ ప్రేమానుబంధం ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన అన్నయ్యతో దిగిన కొన్ని ఫొటోలను కూడా పవన్ కల్యాణ్ పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa