తెలుగు సినీ పరిశ్రమలో 'మెగాస్టార్' అనే పదానికి చిరునామాగా నిలిచిన చిరంజీవి తన సినీ ప్రయాణంలో ఓ అపురూపమైన మైలురాయిని చేరుకున్నారు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే యువకుడు 'చిరంజీవి'గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నేటికి సరిగ్గా 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబర్ 22న ఆయన నటించిన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' విడుదలైంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను ఉద్దేశించి ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో అడుగడుగునా అండగా నిలిచిన ప్రేక్షక దేవుళ్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' పోస్టర్ను పంచుకుంటూ, తన మనసులోని మాటలను అక్షర రూపంలో పెట్టారు. "1978 సెప్టెంబర్ 22.. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే నేను 'చిరంజీవి'గా 'ప్రాణం ఖరీదు' చిత్రంతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాతో నటుడిగా మీరు నాకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి నన్ను మీ అన్నగా, కొడుకుగా, కుటుంబసభ్యుడిగా అక్కున చేర్చుకున్నారు. మెగాస్టార్గా నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఈ 47 ఏళ్ల ప్రయాణం దిగ్విజయంగా సాగిందంటే దానికి కారణం మీరే" అని చిరంజీవి పేర్కొన్నారు.తన విజయానికి పూర్తి కారణం అభిమానుల ఆదరణేనని చిరంజీవి పునరుద్ఘాటించారు. "ఈ రోజు నేను 155 చిత్రాలు పూర్తి చేశానంటే, దాని వెనుక ఉన్న శక్తి మీ నిస్వార్థమైన ప్రేమే. ఈ 47 ఏళ్లలో నేను అందుకున్న ఎన్నో పురస్కారాలు, సత్కారాలు నావి కావు, అవన్నీ మీరు నాకు ఇచ్చినవే. అవన్నీ మీకే చెందుతాయి. మన మధ్య ఉన్న ఈ ప్రేమ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ చిరంజీవి" అంటూ తన సందేశాన్ని ముగించారు. ఆయన పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు, తన పూర్తి పేరు స్ఫూర్తితో రానున్న 'మన శంకర వరప్రసాద్ గారు' అనే మరో ఆసక్తికరమైన చిత్రంలో కూడా నటిస్తున్నారు. గతంలో 'మెగా 157'గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa