రోడ్డు మీద రూపాయి కనిపిస్తే వదలని రోజులు ఇవి. అలాంటిది బంగారం దొరికితే తిరిగి ఇస్తారా. అస్సలు ఇవ్వరు. ప్రస్తుతం బంగారం ధర ఎంతలా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాము కదా. ఇలాంటి సందర్భాల్లో నిజాయతీగా వ్యవహరించే వారు చాలా అరుదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఈ అరుదైన జాబితాలోకి వస్తారు. ఆయన తనకు దొరికిన రూ.7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను, రూ. వేల నగదును పోలీసులు అప్పగించి తన నిజాయతీ చాటుకున్నారు. ఆ వివరాలు..
ఈ సంఘటన ప్రకాశం జిల్లా, కనిగిరిలో వెలుగు చూసింది. స్థానికంగా పండ్లు అమ్ముకునే ఓ వ్యాపారి నిజాయితీ చాటుకున్నారు. వ్యాపారి వద్ద పండ్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి తన చేతిసంచిని మరిచిపోయి వెళ్లిపోయాడు. దీనిలో అందులోని రూ.7 లక్షల విలువైన నగలు, రూ.50 వేల నగదును ఉన్నట్లు పండ్ల వ్యాపారి గుర్తించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా వాటిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనతో ఆ వ్యాపారిని అధికారులు అభినందించారు.
కనిగిరి పట్టణంలోని ఐస్పాల్ కూడలిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బేతంశెట్టి మల్లయ్య అనే వ్యక్తి పండ్లు కొనుగోలు చేయడానికి వచ్చారు. పండ్లు కొనుక్కుని వెళ్లేటప్పుడు, ఆయన తన చేతిసంచిని అక్కడే మరిచిపోయారు. ఆ సంచిని గమనించిన పండ్ల వ్యాపారి షేక్ గౌస్ బాషా మల్లయ్య గురించి వెతికాడు. కానీ అప్పటికే ఆయన అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఇక బాషా తనకు దొరికిన సంచిని తెరిచి చూడగా.. అందులో బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే, ఆయన ఆ సంచిని కనిగిరి పోలీస్స్టేషన్లో అప్పగించారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ పి.సాయిఈశ్వర్ యశ్వంత్, సీఐ షేక్ ఖాజావలి, ఎస్.ఐ.టి.శ్రీరామ్లు ఆ సంచిని పరిశీలించారు. విచారణ అనంతరం, అది బేతంశెట్టి మల్లయ్యదేనని గుర్తించారు. ఆ తర్వాత సంచిని మల్లయ్యకు అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన పండ్ల వ్యాపారి గౌస్బాషా మంచి మనసును అధికారులు ప్రశంసించారు. ఆయనను పూలమాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సంఘటనతో గౌస్బాషా నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచింది.
గతంలో సంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. విశ్రాంత దంపతులు తన మనవరాలి పెళ్లి కోసం కొనుగోలు చేసిన 39 తులాల బంగారాన్ని బస్సులో మర్చిపోయారు. ఇది గమనించిన తోటి ప్రయాణికుడు ఒకరు.. వారి బంగారాన్ని పోలీసులకు అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు. చివరకు ఆ విశ్రాంత దంపతులకు బంగారాన్ని అందించారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa